మంత్రులకు సీఎం జగన్ షాక్ : జిల్లా ఇన్ ఛార్జ్ ల మార్పు: మహిళా మంత్రులకు నో ఛాన్స్..!
ముఖ్యమంత్రి జగన్ పాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల కాలంలోనే గతంలోనే నియమించిన జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒక మహిళా మంత్రికి ఇన్ ఛార్జ్ గా అవకాశం ఇవ్వగా..ఈ సారి మొత్తం 13 జిల్లాలకు పురుష మంత్రులనే ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. మూడు నెలల కాలంలో కొందరు మంత్రుల పని తీరు పరిశీలించిన ముఖ్యమంత్రి రానున్న స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికలతో పాటుగా పాలనా పరమైన వ్యవహారాల కోసం నిర్మొహమాటంగా నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగా.. డిప్యూటీ సీఎంలుగా ఉన్న ఆళ్ల నాని..పిల్లి సుభాష్ చంద్రబోస్ లను ఇన్ ఛార్జ్ మంత్రుల బాధ్యతల నుండి తప్పించారు. నెల్లూరు ఇన్ ఛార్జ్ గా కొనసాగిన హోం మంత్రి సుచరితను తప్పించి ఆ స్థానంలో బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించారు. దీని ద్వారా జగన్ రానున్న రోజుల్లో మంత్రుల పని తీరు విషయంలో ఏ స్థాయిలో ఉండబోతోంది..ఎలా వ్యవహరించబోతోంది ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసారు.

జిల్లాలకు కొత్త ఇన్ ఛార్జ్ మంత్రులు..
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 13 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించారు. కేవలం మూడు నెలల కాలంలోనే వారి పని తీరు..సమర్థత మీద అంచనాకు వచ్చిన సీఎం వారిని మార్చేసారు. కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా కు ఇన్ ఛార్జ్ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండగా ఆయన స్థానంలో కొడాలి నానికి బాద్యతలు అప్పగించారు. అదే విధంగా విజయనగరం కు శ్రీరంగ నాధ రాజు ఉండగా ఆయన్ను మార్చి ఆ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ను నియమించారు. విశాఖ జిల్లాకు మంత్రి మోపిదేవి కొనసాగుతుండగా..ఆయన్ను మార్చి కన్నబాబుకు బాధ్యతలు కేటాయించారు.
ఇక, తూర్పు గోదావరికి ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వ్యవహరించగా..ఆయనకు ఇన్ ఛార్జ్ భాద్యతలు తప్పించారు. ఆయన స్థానంలో మోపిదేవి వెంకటరమణకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక, పశ్చిమ గోదావరికి ఇన్ ఛార్జ్ గా సీనియర్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉండగా..ఆయనకు పని ఒత్తిడి కారణంగా తప్పిస్తూ ఆయన స్థానంలో పేర్ని నానికి ఆ జిల్లా బాధ్యతలు కేటాయించారు.

కీలక జిల్లాల్లోనూ మార్పులు..
ఇక, క్రిష్టా జిల్లా బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు పేర్ని నాని ఉండగా..ఆయన్ని మార్చి ఆ స్థానంలో చెరుకువాడ రంగనాధ రాజుకు కేటాయించారు. ప్రకాశం జిల్లా ఇన్ చార్జ్ గా బుగ్గన రాజేంద్రనాధ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.నెల్లూరు జిల్లాకు బాలినేని శ్రీనివాసరెడ్డిని కేటాయించారు. అదే విధంగా.. కర్నూలు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా అనిల్ కుమార్ కు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయించారు. వైయస్సార్ కడప జిల్లా..ముఖ్యమంత్రి సొంత జిల్లా బాధ్యతలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు అప్పగించారు. అనంతపురం జిల్లా బాధ్యతలను సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణకు కేటాయించగా.. చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా మేకపాటి గౌతం రెడ్డి నియమితులయ్యారు.

మహిళలకు నో ఛాన్స్.. మూడు నెలల కాలంలోనే..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత జూలై 4న ఏపీలోని 13 జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అనేక మార్గాల ద్వారా వారి పని తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. అందులో భాగంగా ప్రభుత్వం..పార్టీ పరంగా వారు తమకు కేటాయించిన జిల్లాల్లో ఏ విధంగా ఫోకస్ చేసిందీ సర్వేల ద్వారా సమాచారం సేకరించారు. దీంతో..మరింతగా సమయం ఇవ్వకుండానే వారికి బాధ్యతలు మారుస్తూ తన ఉద్దేశం ఏంటో ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేసారు. అదే సమయంలో తొలుత నియమించిన ఇన్ ఛార్జ్ మంత్రుల్లో నెల్లూరు జిల్లాకు హోం మంత్రి సుచరిత కు అవకాశం ఇచ్చారు. అయితే, అక్కడ పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా బాలినేనికి బాధ్యతలు అప్పగించారు. మహిళా మంత్రుల్లో ముగ్గురికీ అవకాశం దక్కలేదు. ముఖ్యమంత్రి అనూహ్యంగా తీసుకున్న ఈ మార్పుల నిర్ణయం ద్వారా మంత్రుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.












Click it and Unblock the Notifications