ఆ దెబ్బకే చంద్రబాబు కుప్పం పరిగెత్తి- అక్కడ : దత్తపుత్రుడుపై ఆధారపడ్డారు : ఆ ధైర్యం లేదు - సీఎం ఫైర్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ ఫైర్ అయ్యారు. వారి తీరు పైన మండిపడ్డారు. రాష్ట్రానికి రాంబంధుల్లా తయారయ్యారని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో పేదలకు మంచి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రుణాలు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. తప్పుడు ఫిర్యాదులు..ఆరోపణలతో కోర్టుల్లో కేసులు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ప్రభుత్వం..ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని బేరీజు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మూడేళ్లకే చంద్రబాబు కుప్పం పరిగెత్తారు
వక్రబుద్ది ఉన్న ఈ రాజకీయ నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటూ దేవుడిని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఐ పోలవరం లో వైఎస్సార్ మత్య్సకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. చంద్రబాబు 27 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. ఇప్పటి వరకు కుప్పం లో ఇల్లు లేని చంద్రబాబు..మూడేళ్లకే జగన్ దెబ్బకు కుప్పం పరిగెత్తి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారంటూ ఎద్దేవా చేసారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు తాము చేసిన మంచి చెప్పుకుంటూ గడప గడపకు తిరుగుతుంటే.. చంద్రబాబు సొంత నియోకవర్గంలో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. దుష్ట చతుష్ఠయం ఈర్ష్య-కడపు మంటతో రగిలిపోతున్నారని చెప్పారు. ఆరోగ్యం సమస్య వస్తే ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయిస్తామని.. ఈర్ష్య..కడుపు మంటకు దేవుడు మాత్రమే వైద్యం చేస్తాడని చెప్పుకొచ్చారు. పరీక్ష పేపర్లు వీళ్లే లీకులు చేసే వారిని సమర్ధించే ప్రతిపక్షం ఎక్కడైనా చూసారా అంటూ ప్రశ్నించారు.

దత్తపుత్రుడు - కుమారుడిని నమ్ముకొని రాజకీయం
ఈ ఎస్ఐ లో అక్రమాలకు పాల్పడిన నేతను విచారిస్తుంటే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కొడుక్కు పచ్చి అబద్దాలు..మోసాలు శిక్షణ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని చూసారా అంటూ నిలదీసారు. మంత్రిగా పని చేసి మంగళగిరి ఓడిన సొంత పుత్రుడు ఒకరు.. రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరిని చంద్రబాబు నమ్ముకున్నారని దుయ్యబట్టారు. ప్రజలను నమ్ముకోకుండా.. దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నారని ఎద్దేవా చేసారు. పేదలకు ఇళ్ల స్థలాల పైన కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్న ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందన్నారు. కళ్లు ఉండి చూడలేని కభోదులను రాష్ట్ర ద్రోహులా - దేశ ద్రోహులా ఏమనాలని ప్రశ్నించారు. మంచి చేసానని చెప్పుకొనే ధైర్యం చంద్రబాబుకు... చంద్రబాబు మంచి చేసారని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదంటూ ఫైర్ అయ్యారు.

ప్రతీ అంశంలో అడ్డు పడుతున్నారు.. ధైర్యం లేదు
ఈ మూడేళ్ల కాలంలో చేసిన మంచిని తాను స్వయంగా రాసిన లేఖలతో తన పార్టీ నేతలు నేరుగా ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్తున్నారని వివరించారు. గడప గడపకు వెళ్లి చేసిన మంచి చెప్పుకొనే ధైర్యం తమకు ఉందన్నారు. 95 శాతం హామీలు పూర్తి చేసామని.. చేసింది చెప్పుకుంటూ ప్రతీ గడపకు వెళ్లే ధైర్యం తమకు మాత్రమే ఉందంటూ సీఎం చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు చేసిన నష్టాలను వివరించారు. మేనిఫెస్టోను బైబిల్ - భగవద్గీతగా భావించామని చెప్పుకొచ్చారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లక్షా 40 వేల కోట్ల రూపాయాలు అందించామని చెప్పుకొచ్చారు. లక్షా 9 వేల మందికి భరోసా కల్పించేందుకు వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఒక్కో కుటుంబానికి 10 వేల చొప్పున 108.75 లక్షల రూపాయాలు జమ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications