ఏపీ పొత్తు రాజకీయం - పట్టు బిగిస్తున్న సీఎం జగన్, ఢిలీలో కొత్త సమీకరణాలు..!!
ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏపీలో జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయి. కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించాయి. ఈ సమయంలో జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద పట్టు బిగిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఎన్నికలు..పొత్తుల వేళ సీఎం పర్యటనపై ఆసక్తి కొనసాగుతోంది.
సీఎం మూడు రోజుల ఢిల్లీ టూర్: ఏపీలో ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ పొత్తులపైన క్లారిటీ ఇవ్వనుంది. జనసేనాని పవన్ అటు బీజేపీని తమతో కలిసి రావాలని ప్రతిపాదించారు. దీని పైన బీజేపీ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ ను ఇరుకున పెట్టే వ్యూహాలకు చంద్రబాబు, పవన్ పదును పెడుతున్నారు. కేంద్రం నుంచి జగన్ కు మద్దతు లేకుండా చేయాలనేది వారి వ్యూహం. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంతో పాటుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు.

కేంద్ర నాయకత్వానికి బాసటగా: ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు (శనివారం) జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని మోదీతో పాటుగా హోం మంత్రి అమిత్ షా, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశం అవుతారని తెలుస్తోంది. నీతి అయోగ్ సమావేశంలో రాష్ట్రం పలు అంశాల్లో సాధించిన పురోగతి..అమలు చేస్తున్న విధానాలను వివరించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సాయం పైన సమీవేశంలో ప్రస్తావించనున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్ ప్రారంభోత్సవం గురించి జాతీయ స్థాయిలో ప్రధాని మోదీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న వేళ సీఎం జగన్ మద్దతుగా నిలిచారు. ప్రధానికి అభినందనలు తెలిపారు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

పొత్తు రాజకీయంపై క్లారిటీ: బీజేపీతో సఖ్యత, పొత్తు దిశగా తన ప్రత్యర్ధి పార్టీలు అడుగులు వేస్తున్న వేళ సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ ను ఊరటనిచ్చేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఎన్నికల వరకు ఇదే రకమైన మద్దతు జగన్ కోరుకుంటున్నారు. నూతన పార్లమెంట్ ప్రధాని ప్రారంభిస్తున్న వేళ సీఎం జగన్ స్వయంగా హాజరవుతున్నారు. ప్రధాని మోదీతో తనకు ఉన్న సత్సంబంధాలను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీలో పొత్తులు..ఎన్నికల రాజకీయం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా సీఎం జగన్ మంత్రాంగం ముమ్మరం చేసారు. దీంతో..ఈ పర్యటన వేళ చోటుచేసుకొనే రాజకీయం పై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications