ఇక ప్రజల్లోనే జగన్, బస్సు యాత్ర - ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఫిక్స్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్దులను ఇప్పటికే జగన్ ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచారానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జగన్ ఎన్నికల వరకు ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించారు. బస్సు యాత్ర ద్వారా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కార్యాచరణ సిద్దం చేసారు. ప్రతీ రోజు ఒక బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేసారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాల్లో సమీక్షలు చేయనున్నారు.
ప్రచార శంఖారావం
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రచారం ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగేలా షెడ్యూల్ ఖరారు చేసారు. అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా "మేమంతా సిద్ధం" పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.

ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. స్థానికంగా సామాజిక వర్గాల పెద్దలు..స్థానిక ప్రముఖులతో సమావేవాలు నిర్వహిస్తారు ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. నెల రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. రూట్ మ్యాప్ ను రేపు (మంగళవారం) పార్టీ ప్రకటించనుంది.
ఇక ప్రజల్లోనే ఉండేలా
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, పోలింగ్ కు మరో 55 రోజులు ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంతవరకు ప్రజల మధ్యనే ఉంటానని పార్టీ నేతలు జగన్ స్పష్టం చేసారు. పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఎన్నికల ప్రచార షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రూపకల్పన చేస్తున్నారు. తన పాలనలో అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం ప్రధాన అస్త్రాలుగా జగన్ ప్రచారం కొనసాగనుంది.
అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల కూటమి, రాజకీయాల గురించి వివరించనున్నారు. ప్రతీ రోజు ఒక బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా తన పాలనతో పాటుగా కొత్తగా ఖరారు చేయనున్న ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు మధ్నాహ్నం జరిగే రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో ప్రచారం పై దిశా నిర్దేశం చేయనున్నారు.
మేనిఫెస్టోతో ప్రజల్లోకి
నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ ప్రచార పర్యటనలు ప్రధానాంశంగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పర్యటనలు కొనసాగాలి.. రూట్ మ్యాప్ ఎలా సాగాలి.. తదితర అంశాలపై ఈ కీలక సమావేశంలో చర్చించనున్నారు. గత ఎన్నికల సమయంలో విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. చెబుతున్నాయి. ప్రచారం సమయంలోనే నియోజకవర్గంలో పార్టీ పరంగా అనుకూల - ప్రతికూల పరిస్థితులు, అభ్యర్దులకు కేడర్ సహకారం, క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకొని సీఎం జగన్ వారికి అవసరమైన దిశా నిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications