హైకోర్టు సీజేతో నేడు సీఎం జగన్ భేటీ - సమావేశంపై ఆసక్తి : అసలు అజెండా అదేనా..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ కానున్నారు. ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రతో ఈ సాయంత్రం విజయవాడలోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో సమావేశం అవ్వనున్నారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రమాణ స్వీకారం సమయంతో పాటుగా అనేక సందర్బాల్లో సీఎం కలిసారు.
అయితే, ఇప్పుడు ఇద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావటం పైన ఆసక్తి నెల కొని ఉంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విజయవాడకు వచ్చిన సమయంలోనూ వీరంతా కలిసే ఉన్నారు. ఇక, ఈ సమావేశంలో న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటులో భాగంగా.. హైకోర్టు అక్కడ ఏర్పాటు అంశం పైన చర్చకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే, దీని పైన ఇప్పటికే కేంద్రం తమ వైఖరి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి అందులో సూచనలు చేసింది. అదే సమయంలో తాజాగా మూడు రాజధానుల వ్యవహారం పైన హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ అంశం పైన న్యాయస్థానం సైతం క్లారిటీ ఇచ్చింది. అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీలో న్యాయస్థానాల్లో మౌళిక వసతులు..సిబ్బంది నియామకాల పైన వీరిద్దరూ చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం నేలపాడులోని హైకోర్టు తాత్కాలిక భవనంగా కొనసాగుతోంది.
అక్కడ పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులో లేకపోవటంతో..సమీపంలోనూ మరో నిర్మాణం ప్రారంభించారు. అది పూర్తి చేయటంతో పాటుగా.. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు భవనాల నిర్మాణం.. సిబ్బంది నియామకం దిశగా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ఈ నెల 29న ఢిల్లీలో సీజేఐ ఎన్వీ రమణ - ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు - సీజేల సమావేశం జరగనుంది. దీనికి ముందుగా హైకోర్టు సీజే - ఏపీ సీఎం సమావేశం అవుతున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.