ప్రధానితో సీఎం జగన్ కీలక భేటీ - అమరావతి, పొత్తులపై క్లారిటీ..!?
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రోజు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం సమావేశం కానున్నారు. ఏపీలో పొత్తు రాజకీయాలు..ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వం పైన నడ్డా, అమిత్ షా ఆరోపణల తరువాత ప్రధానితో సీఎం జగన్ సమావేశం కానుండటం ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్రంలో మారుతున్న సమీకరణాలు..ఏపీ పై బీజేపీ వైఖరి..పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులపై వైసీపీ మద్దతు తో సహా అమరావతి, పోలవరం, ఆర్దిక అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
నేడు ప్రధానితో సీఎం జగన్ భేటీ:ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ముందుగా మధ్నాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ ఖరారైంది.

అమిత్ షా తో భేటీ సమయంలో పోలవరం అడహక్ నిధుల విడుదలలో జాప్యంతో పాటుగా తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశం పైన చర్చించనున్నారు. దీంతో పాటుగా రాజకీయ అంశాలను షా తో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల పైన జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ప్రధాని, అమిత్ షా తో సీఎం జగన్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించటం ద్వారా టీడీపీతో పొత్తుకు అవకాశం లేదనే బీజేపీ పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి.
అమరావతి..పోలవరంపై చర్చలు:ఈ నెలలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశ పెడుతోంది. రాజ్యసభలో వైసీపీ మద్దతు ఉంటేనే ఆ బిల్లులు ఆమోదం పొందుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ మద్దతు బీజేపీకి కీలకంగా మారుతోంది.
ఇదే సమయంలో కేంద్రం నుంచి పెండింగ్ అంశాలను క్లియర్ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారు. మరి కొద్ది రోజుల్లో విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే అమరావతి వ్యవహారం కోర్టులో ఉండటంతో..ప్రత్యామ్నాయంగా పార్లమెంట్ ద్వారా రాజధాని ప్రక్రియ పూర్తి చేసే కసరత్తు పైన ప్రభుత్వంలో చర్చ లు జరుగుతున్నాయని తెలుస్తోంది. సుప్రీంలో కేసు పెండింగ్ లో ఉన్న సమయంలో ఈ ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నారు.

పొత్తులు..ఎన్నికల పై క్లారిటీ:ప్రధాని, షా తో పర్యటన సమయంలో ఏపీలో బీజేపీ రాజకీయ వైఖరి పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కేంద్రం ముందస్తు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం పైన క్లారిటీ ఇస్తారని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే ఏపీలోనూ ఎన్నికలు జరగనున్నాయి.
సాయంత్రం కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రేపు (గురువారం) రెండో రోజు కూడా సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో పాటుగా హౌసింగ్, విమానాయాన, వ్యవసాయ శాఖ మంత్రులను కలుస్తారని తెలుస్తోంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications