వాలంటీర్ల సేవలకు ప్రత్యేక గుర్తింపు - సీఎం జగన్ కీలక నిర్ణయం..!!
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారింది. ప్రతీ ఇంటికి సేవలు అందించటంలో వీరి పాత్ర ప్రముఖంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. పెన్షన్ మొదలు ప్రభుత్వ సేవలు అందించటంలో వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా విజయవాడలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు.
సేవలకు ప్రభుత్వం గుర్తింపు:సచివాయాల పరిధిలో వాలంటీర్లు అందిస్తున్న సేవలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తోంది. ప్రతీ ఏటా వాలంటీర్లకు వందనం పేరుతో ప్రత్యేకంగా అవార్డుల ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ రోజు వాలంటీర్లకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. వాలంటీర్లకు వారి పని తీరు ఆధారంగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేస్తోంది. పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వలంటీర్ల పని తీరే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు.

అవార్డుల ప్రధానోత్సవం:ఈ రోజు ప్రారంభమయ్యే ఈ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. వలంటీర్లు అందిస్తున్న సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. నియోజకవర్గంలో అత్యత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర పేరుతో.. సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో పాటు రూ.30,000 నగదు బహుమతి అందించనున్నారు. ఇక సేవా రత్న పేరుతో ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మంది చొప్పున టాప్-1 ర్యాంకు సాధించిన వలంటీర్లకు సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో పాటు రూ.20,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. సేవా మిత్ర ద్వారా ఎలాంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వలంటీర్లకు సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో పాటు రూ.10,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.
సీఎం జగన్ హాజరు:ఈ రోజు ప్రధానం చేయనున్న మొత్తంతో కలిపితో కలిపి ఇప్పటి వరకు వలంటీర్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం ఖర్చుచేసినట్లు అవుతుంది. జగనన్న సంక్షేమ క్యాలెండర్ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులుగా వాలంటీర్లను ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నందుకు వాలంటీర్ వ్యవస్థకు గుర్తింపు ఇవ్వటం బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్ల సేవలకు ప్రత్యేక గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications