ఇడుపులపాయకు సీఎం జగన్ - తండ్రికి షర్మిల నివాళి..!!
ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయకు రానున్నారు. దివంగత ముఖ్యమంత్రి..వైఎస్సార్ వర్దంతి సందర్భంగా వైయస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సైతం వైఎస్సార్ ఘాట్ లో తన తండ్రికి నివాళి అర్పించనున్నారు. వైఎస్సార్ వర్దంతి నాడు నివాళులు అర్పించటంతో పాటుగా వైసీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. కడప పర్యటన తరువాత సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి. ఆ తర్వాత వైయస్ఆర్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం జగన్ శనివారం రాత్రి విజయవాడ నుంచ లండన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నెల 11న రాత్రి తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

లండన్ లో ఉన్న తమ ఇద్దరు కుమార్తెల వద్దకు సీఎం దంపతులు జగన్, భారతీ రెడ్డి వెళ్తున్నారు. లండన్ తో పాటుగా యూకేలోని ఇతర ప్రాంతాల్లోనూ వారు పర్యటించే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నందున..ఆ సమయంలో లండన్ కు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చే ఉద్దేశంతో సీఎం జగన్ ఇప్పుడు లండన్ పర్యటన ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, వైఎస్సార్ వర్దంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఈ సాయంత్రం ఇడుపులపాయకు చేరుకోనున్నారు. రేపు (శనివారం) ఉదయం 8గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అయితే, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా, రాహుల్ తో భేటీ అయిన షర్మిల తన రాజకీయ భవిష్యత్ పైన రేపు ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications