రైతు భరోసా నిధుల జమ ముహూర్తం ఖరారు చేసిన సీఎం జగన్..!!
ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుసగా రెండో సారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలు కూటమిగా జగన్ ఓటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. జగన్ తాను అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. ఈ సమయంలోనే వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల పైన జగన్ నిర్ణయించారు.
రైతు భరోసా నిధులు : ఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో సంక్షేమ పథకాలను మరింత పక్కాగా అమలు చేయటానికి నిర్ణయించారు. వైఎస్సార్ రైతు భరోసా నిధులను ఈ నెల 28న విడుదలకు సీఎం జగన్ ముహూర్తంగా ఖరారు చేసారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతుభరోసా మూడో విడత కింద 53.58 లక్షల మంది ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,078 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2023-24 సీజన్ మూడో విడత కింద పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాగా రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.34,288 కోట్లు సాయం చేసినట్టు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

28న విడుదల : రైతు భరోసా నిధులు 2023-24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు రూ.1,078.36 కోట్లు జమ చేయనున్నారు. అలాగే రబీ 2021 - 22, ఖరీఫ్ - 2022 సీజన్లో సున్నా వడ్డీ రాయితీకి అర్హత పొందిన 10.79 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.215 కోట్లు జమ చేస్తారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.2,050.53 కోట్లు జమ చేశారు. మార్చి 13 తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో, ఈ లోగానే రైతుల ఖాతాల్లో నిధుల జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం జగన్ కీలక నిర్ణయం : ఇక, మార్చి 3న అద్దంకి వేదిగా వైసీపీ నాలుగో సిద్దం సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సభా వేదికగానే సీఎం జగన్ రైతులకు సంబంధించి మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. రైతు రుణమాఫీ పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులతో పాటుగా మహిళలకు మేలు చేసే మరో నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఇటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోల 99 శాతం అమలు చేయటంతో..ఇప్పుడు కూడా అమలు చేసే హామీలనే మేనిఫెస్టోలో ప్రకటన చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications