సీఎం సోదరుడిగా చూసారు- భారతి వడ్డించారు : సమస్యకు ఆమోద యోగ్య పరిష్కారం - చిరంజీవి..!!
ముఖ్యమంత్రి జగన్ - మెగాస్టార్ చిరంజీవి మధ్య దాదాపు గంటా 20 నిమిషాల సేపు సమావేశం జరిగింది. ఈ సమావేశం పైన చిరంజీవి పూర్తి సంతృప్తి కలిగించిందన్నారు. ఆయన సోదరుడుగా నాతో వ్యవహరించారు. భారతి ఆప్యాయంగా వడ్డించారని చిరంజీవి చెప్పారు. సీఎం తనను ఆహ్వానించి.. రెండు వైపులా ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుందామని సీఎం ఆలోచనగా చెప్పారని వివరించారు. పేదల పైన భారం పడకుండా తీసుకున్న నిర్ణయంగా చిరంజీవి పేర్కొన్నారు.

సీఎం పూర్తి సానుకూలంగా స్పందించారు
అదే సమయంలో తాను సైతం సినీ పరిశ్రమలోని అన్ని కేటగిరీలకు చెందిన వారి సమస్యలను తాను వివరించానన్నారు. వీటిని ప్రభుత్వ కమిటీకి నివేదిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆ తరువాత కమిటీ ఇచ్చే సిఫార్సులు అందగానే మరోసారి భేటీ అవుదామని సీఎం ప్రతిపాదించారు. ఆ సమయంలో చిరంజీవితో చర్చించిన తరువాత జీవో జారీ చేస్తామంటూ ముఖ్యమంత్రి అభయమిచ్చారు. తాను ఒక పక్షానే ఉండనని..అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందామంటూ సీఎం చెప్పటం సంతోషం కలిగించదని చెప్పారు. జీవోలో అవసరమైన మార్పులు అన్నీ చర్చించిన తరువాత జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు.

పెద్దగా కాదు..బిడ్డగా వచ్చాను
తాను ఇండస్ట్రీ పెద్దగా కాదు.. బిడ్డగా వచ్చానని చిరంజీవి పేర్కొన్నారు. తన మాట మీద గౌరవం ఉంచి..ఇండస్ట్రీ నుంచి ఎవరూ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయవద్దని చిరంజీవి సూచించారు. డ్రాఫ్టు మీరంతా ఒప్పుకున్న తరువాతే జీవోగా బయటకు వస్తుందంటూ సీఎం ఇచ్చిన హమీ పైన తాను పరిశ్రమలోని అందరితోనూ చర్చిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత దాదాపు ఈ నెలలోనే ఆమోదమైన జీవో వస్తుందని చెప్పారు. అదే విధంగా చిన్న సినిమాలకు 5వ షో కావాలని కోరుకుంటున్నారని ప్రతిపాదించగా... పరిశీలిద్దామంటూ సీఎం చెప్పారని చిరంజీవి వివరించారు. తాను ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని చెప్పారు.

సీఎం ఒక సోదరుడిగా గౌరవించారు
తరువాత తాను పరిశ్రమలోని గిల్డ్.. ఛాంబర్... అందరితోనూ సమావేశం అవుతానని చెప్పారు. మళ్లీ ఎప్పుడు కలుద్దామని తాను అడగ్గా... అన్నా.. మీరు ఎప్పుడైనా రావచ్చంటూ చెప్పారంటూ చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు. దీని ద్వారా సీఎం మరోసారి తనను ఒక్కడినే రమ్మంటే తానొక్కడినే వస్తానని... పరిశ్రమలోని వారిని సైతం తీసుకురమ్మంటే వారితో వస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు. దీంతో..ఈ సమావేశం ద్వారా చిరంజీవి సీఎం జగన్ పరిశ్రమ పైన సానుకూల వాతవరణంలో చేసిన చర్చలతో అనుకూల నిర్ణయం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications