CM Jagan:అమరావతి పై సీఎం జగన్ కీలక నిర్ణయం దిశగా - టార్గెట్ ఫిక్స్ ..!!
CM Jagan on Amaravati: వచ్చే ఎన్నికలపై ముఖ్యమంత్రి సిద్దం అవుతున్న వేళ..వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి మూడు రాజధానుల నినాదంతో ఉత్తరాంధ్ర - సీమ ప్రాంతాల్లో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టామనే అభిప్రాయంతో ఉంది. తాజాగా సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మరింత ఆశాభావం పెరిగింది.
ఇదే సమయంలో అమరావతికి మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు..ఈ ప్రాంతంలో వైసీపీ పైన రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ముఖ్యమంత్రి అమరావతి కేంద్రంగా కీలక అడుగులకు సిద్దం అవుతున్నారు.

అమరావతిలోనూ పట్టు సడలకుండా..
వై నాట్ 175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్న జగన్..మూడు రీజియన్లలో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర - రాయలసీమలో బలం తగ్గలేదనే అంచనాతో ఉన్నారు. అయితే, అమరావతి తో పాటుగా మరో రెండు రాజదానుల నిర్ణయంతో ప్రతిపక్షాలు అమరావతిలో మాత్రమే రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాయి. దీని ద్వారా రాజకీయంగా వైసీపీని అమరావతి పరిధిలో దెబ్బ తీసేందుకు సిద్దమయ్యాయి. కానీ, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తరువాత టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర మధ్యలోనే నిలిచిపోయింది. ఈ సమయంలో మరింత పట్టు సాధించేలా ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలను సిద్దం చేస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా..అమరావతి రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు, అక్కడ ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన కార్యచరణ పైన త్వరలో అధికారికంగా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమరావతి పై వ్యతిరేకత లేదని చాటేలా..
అమరావతి ప్రభావం కృష్ణా - గుంటూరు జిల్లాల్లో కొన్ని సెగ్మెంట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో..టీడీపీకి ఎక్కడా అవకాశం ఇవ్వటానికి సిద్దంగా లేని ముఖ్యమంత్రి, సుప్రీం కోర్టు తుది తీర్పుకు అనుగుణంగా నిర్ణయాలు ప్రకటించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
గతంలో ప్రభుత్వం నుంచి రైతులతో చేసుకున్న ఒప్పందాల అమలు ప్రక్రియ త్వరలోనే పూర్తి చేసేలా ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అమరావతి పరిధిలో భూమి లేని నిరుపేదలకు పెన్షన్ పంపిణీ బాధ్యలను ఈ రోజు నుంచి ప్రభుత్వం వాలంటీర్లకే అప్పగించింది.
29 గ్రామాల్లోని 17,173 మందికి రూ 2500 చొప్పున పంపిణీ జరుగుతోంది. అదే విధంగా కరకట్ట విస్తరణ.. మౌళిక వసతుల కల్పనకు సంబంధించి నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా అమరావతి అభివృద్ధి పైన యాక్షన్ ప్లాన్ ప్రకటించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

ఆ రెండు నియోజకవర్గాల్లో గెలవాల్సిందే..
ఇదే సమయంలో రాజకీయంగానూ అమరావతి ప్రాంతంలో తిరిగి బలం చాటుకొనేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా తాడికొండ - మంగళగిరి నియోకవర్గాపైన ఫోకస్ పెట్టారు. మంగళగిరి నుంచి లోకేశ్ మరోసారి పోటీ చేయటం ఖాయమైంది. ఇప్పటికే గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. అయితే, అక్కడ టీడీపీలో పని చేసిన గంజి చిరంజీవి లాంటి వారిని వైసీపీలోకి తీసుకున్నారు.
మురుగుడు కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక, తాడికొండలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం అందరూ సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు. ఈ సమయంలోనే అమరావతి ప్రాంతంలో ఎక్కడా రాజకీయంగా వ్యతిరేకత లేకుండా అంతా సెట్ చేసుకొనేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. దీంతో, అమరావతి కేంద్రంగా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications