వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్... ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు...
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న రోజా... ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించిన విషయాన్ని రోజా ఒక ప్రకటనలో వెల్లడించారు. వైద్యుల సలహాలు పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని ఆయన తనతో చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి వాకబు చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వేంకటశ్వేర స్వామి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడాలని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే రోజా... ఈ నెల 4న డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని స్వగృహానికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు కొన్ని వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు.
దాదాపు వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో రోజా చికిత్స పొందారు.నిజానికి గత ఏడాదే రోజాకు సర్జరీ చేయాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీని వాయిదా వేశారు. ఇటీవల సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లగా... వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి లోక్సభ ఉపఎన్నిక పూర్తయ్యేంతవరకూ రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరినప్పటికీ... అది మంచి నిర్ణయం కాదని వైద్యులు వారించినట్లు సెల్వమణి తెలిపారు. దీంతో ఇక ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నట్లు చెప్పారు.
కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజాను ఫోన్ ద్వారా పరామర్శించారు. రోజాకు ఫోన్ చేసిన సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజులు రాజకీయాల గురించి పట్టించుకోకుండా ప్రస్తుతానికి ఆరోగ్యం పైనే శ్రద్ద పెట్టాలని సూచించారు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఆమె క్షేమాన్ని కోరుతూ స్థానిక ఆలయాల్లో వైసీపీ నాయకులు నిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం(ఏప్రిల్ 23) నిండ్ర, విజయపురం మండల వైసీపీ నాయకులు చెన్నైలో రోజాను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.