కిరణ్ రెడ్డి సీమాంధ్ర హీరోనా: చంద్రబాబు ఫైట్?
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ఓడించడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి సీమాంధ్రలో హీరో అవుతారా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. సమైక్యాంధ్ర కోసం తిరుగులేని పోరాటం చేసిన నాయకుడిగా ముఖ్యమంత్రి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ బిల్లును చెత్తబుట్టలో వేయాలనేంత తీవ్రమైన వ్యాఖ్యలు ఆయన చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై, పార్టీ అధిష్టానంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దానికితోడు, బిల్లును తిరిగి పంపించాలని కోరుతూ సభలో తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును సభలో ప్రవేశపెట్టి అది నెగ్గినట్లుగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇది కూడా సమైక్యాంధ్ర కోసం తిరుగులేని పోరాటం చేస్తున్న నాయకుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెడుతుందని అంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇచ్చిన తర్వాత శాసనసభా కార్యక్రమాలు స్తంభిస్తూ వచ్చాయి. దీంతో తెలంగాణ బిల్లుపై స్పీకర్ చర్చను ముగించారు. అయితే, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి మాట్లాడేందుకు అవకాశం రాలేదు. ఓ రకంగా అది చంద్రబాబును కాపాడిందని అంటున్నప్పటికీ అభిప్రాయం చెప్పలేని స్థితి సభలో ఏర్పడడం కాస్తా ఆలోచించాల్సిన విషయమే. దీనిపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, ఇది కుట్రలో భాగంగానే జరిగిందని చంద్రబాబు విమర్సించారు. కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో హీరో కాకుండా చూసే ఎత్తుగడలో ప్రస్తుతం చంద్రబాబు పడినట్లు కనిపిస్తున్నారు. తాను సమైక్య హీరో అయిపోవాలనే విధంగా కిరణ్ రెడ్డి వ్యవహరించారని ఆయన అన్నారు. అంతా టెన్జన్ పథ్ (సోనియా నివాసం) స్క్రిప్టు ప్రకారమే నడుస్తోందని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని వదులుకుని సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నారు. అయితే, జగన్ సీమాంధ్రలో హీరో కాకుండా చూసేందుకు అవసరమైన వ్యూహాన్ని కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించినట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలో సమైక్యాంధ్ర కోసం చివరంటా నిలబడిన నాయకుడిగా కిరణ్ కుమార్ రెడ్డి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తన్నారనే మాట వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డికి సీమాంధ్రలో ప్రజాదరణ పెరగకుండా చూడాలనే వ్యూహరచనతో తెలుగుదేశం పార్టీ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ బలహీనపడిపోయారని, కిరణ్ కుమార్ రెడ్డికి క్రెడిట్ తగ్గకుండా చూస్తే తామే నిలుస్తామని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.