రాజధాని రైతుల కోసం కొత్త ప్రతిపాదనలు: తరలింపు రూట్ మ్యాప్: నేటి భేటీలో ఫైనల్..!
ఏపీలో మూడు రాజధానుల తరలింపు ప్రతిపాదన ఆమోదానికి ముమూర్తం దగ్గర పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఒకే రోజులో ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ ఫిక్స్ చేసింది. అయితే, కీలక మైన అమరావతి రైతులకు ఏం చేస్తారనేది మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. రైతులతో చర్చలు జరపలేదు. అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రైతులు నెల రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రభుత్వం రాజధాని తరలించలేదని..సాధ్యం కాదని ఇప్పటికీ చెబుతున్నాయి. ఇదే సమయంలో రాజధాని రైతుల విషయంలో ఈ రోజున హై పవర్ కమిటీ సభ్యులు సీఎంతో సమావేశమవుతున్నారు. ఈ భేటీలో రైతులకు సంబంధించిన ప్రతిపాదనలు..ప్యాకేజీ ఖరారు చేయనున్నారు. దీనినే తుది నివేదికలో పొందుపర్చనున్నారు. శని..ఆది వారాల్లో ఈ కమటీ సమావేశమై..కమిటీకి తుది రూపు ఇవ్వాలని భావిస్తున్నారు.
రైతుల అంశమే ప్రధాన అజెండా..
రాజధాని రైతుల సమస్యలపై హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్తో చర్చించనున్నారు. ఇప్పటికే జీఎన్ రావు, బీసీజీ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే. మూడు సార్లు సమావేశమైన కమిటీ సభ్యులు రెండు నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కమిటీ తమ నివేదికకు తుది రూపు ఇచ్చే ముందు సీఎం వైఎస్ జగన్తో భేటీ కానుంది. ఇప్పటికే రైతులకు సంబంధించి తమ అభిప్రాయాలను సీఆర్డీఏకు చెప్పాలంటూ కమిటీ ఇచ్చిన సమయం ఈ సాయంత్రంతో ముగియనుంది. అయితే, ప్రభుత్వం రాజధాని గ్రామాలను అమరావతి కార్పోరేషన్ గా ప్రతిపాదన.. అదే విధంగా కౌలు మరో మూడేళ్లు కొనసాగింపు.. విజయవాడ వరకు యాక్సిస్ రోడ్ల పొడిగింపు..వ్యవసాయ ప్రత్యేక జోన్ గా ప్రకటన వంటి అంశాలకు ఈ రోజు తుది రూపు ఇవ్వనున్నారు.

తరలింపు రూటు మ్యాపు పైనా..
ఈ రోజు జరిగే సమావేశంలో రాజధాని తరలింపు..అసెంబ్లీ వ్యూహం పైనా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో భేటీ తరువాత కమిటీ సభ్యులు మరో సారి సమావేశం కానున్నారు. శని..ఆది వారాల్లోనూ ఈ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. అదివారం మధ్నాహ్నం కమిటీ తమ నివేదికను ముఖ్యమంత్రికి అందిస్తుందని తెలుస్తోంది. సోమవారం కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసిన తరువాత వెంటనే శాసనసభలో ఇదే నివేదిక పర్వేశ పెట్టనున్నారు. పరిపాలన వికేంద్రీకరణపై ఈ నెల 20న ఏపీ అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో అన్ని పార్టీలు న్యాయ పరంగా ఈ అంశంలో పోరాటం చేస్తామని చెబుతుండటంతో... న్యాయ పరమైన సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక, ఈ కమిటీ నివేదిక పైన అసెంబ్లీ..మండలిలో తీర్మానం ప్రతిపాదించి ఆమోదం పొందిన తరువాత రాజధాని ప్రతిపాదనలు..కార్యరూపంలో రానున్నాయి.












Click it and Unblock the Notifications