ముగ్గురు మహిళలే చేశారు: సిఎం, జగ్గారెడ్డిది సమైక్యమే
హైదరాబాద్: ముగ్గురు మహిళలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ బుధవారం మండిపడ్డారు. సభాపతి మీరా కుమార్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోకసభలో ప్రతిపక్ష సభ్యురాలు సుష్మా స్వరాజ్లు ప్రజాస్వామ్యాన్ని నిన్న హత్య చేశారన్నారు.
నిన్న లోకసభలో జరిగిన అమానుషాన్ని ప్రపంచం మొత్తం గమనించిందన్నారు. కాంగ్రెస్, బిజెపిలు దేశ పరువును గంగలో కలిపారని విమర్శించారు. సోనియా, రాహుల్ గాంధీలు సీమాంధ్రకు వెళ్లగలరా అని ప్రశ్నించారు. ఇంత జరిగాక సుష్మా స్వరాజ్ సీమాంధ్రలో అడుగు పెట్టగలరని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పగలరా అని ప్రశ్నించారు.
సమైక్యమే నినాదమన్న జగ్గారెడ్డి
సమైక్యమే తన నినాదం అని ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసన సభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి) మెదక్ జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు మద్దతివ్వడం మంచిదేనని, తాను అవసరమైతే పార్టీ కార్యకర్తగా పని చేస్తానని, పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పారు.