"ప్రతీ శుక్రవారం.. కోర్టులో 33సార్లు జగన్ పేరు పిలుస్తారు"
న్యూఢిల్లీ : నల్లధనం ఆదాయాన్ని వెల్లడించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ప్రకటించడం మాటేమో గానీ విషయం కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీలా తయారైంది. హైదరాబాద్ నుంచి 10వేల కోట్ల నల్లధనాన్ని వెల్లడించింది జగనే అంటూ చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆరోపించడం.. దాన్ని తిప్పికొట్టే క్రమంలో రోజా లాంటి నేతలు నోటికి పనిచెప్పడం.. ఇలా ఇరు పార్టీల మధ్య బ్లాక్ మనీ హీట్ రగులుతోంది.
తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్.. వైసీపీ అధినేత జగన్ పై పలు ఆరోపణలు గుప్పించారు. అవినీతి గురించి జగన్ మాట్లాడుతుండడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిని చరిత్ర జగన్ కు ఉంది గనుకే.. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పదివేల కోట్ల రూపాయలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారనగానే అందరి చూపు నేరాలు చేసినవారి వైపే ఉంటుందన్నారు.
జగన్ ఆస్తుల్లో ఇప్పటికే 10వేల కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసుకుందన్నారు సీఎం రమేశ్. నల్లధనం విషయంలో బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాని మోడీకి జగన్ లేఖ రాయడాన్ని ఎద్దేవా చేస్తూ.. ఇప్పటికీ ప్రతీ శుక్రవారం నాడు కోర్టులో జగన్ పేరును 33 సార్లు పిలుస్తారని అన్నారు. అలాంటి వ్యక్తి అవినీతిపై ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ అవినీతి సొమ్ములు కూడబెట్టుకున్నదెవరో బాగా తెలుసన్నారు. పుచ్చకాయల దొంగ అనగానే భుజాలు తడుముకోవద్దని జగన్ కు హితవు పలికారు.