టీ తీర్మానాన్ని ఓడించాకే రాజీనామాలు: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించిన తర్వాతనే రాజీనామాలు చేద్దామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర శాసనసభ్యులకు సూచించారు. ఈ మేరకు సమావేశం నిర్ణయం చేసిన విషయాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ధ్రువీకరించారు. సిడబ్ల్యుసి నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం దూసుకెల్తూ కేబినెట్లో నోట్ను ఆమోదించడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో సమావేశమయ్యారు.
తెలంగాణ నోట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో భవిష్యత్ కార్యాచరణపై మూడు గంటలపాటు సూదీర్ఘంగా చర్చలు జరిపారు. అందరం మూకుమ్మడిగా పదవులకు, పార్టీకి రాజీనామాలు చేస్తామని ప్రజాప్రతినిధులు సిఎంకు చెప్పారు. అయితే, రాజీనామాలు వద్దని ఆయన వారికి నచ్చజెప్పారు.
అందరం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని రాజీనామాలు చేస్తే అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించడం కుదరదని, అందుచేత శాసనసభకు తెలంగాణపై తీర్మానం వచ్చినప్పుడు దాన్ని ఓడించిన తర్వాతే భవిస్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని వారికి నచ్చచెప్పినట్లు తెలియవచ్చింది. తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ఓడించిన తర్వాత రాజీనామా చేస్తామని సీమాంధ్ర మంత్రి శైలజానాథ్ మీడియా సమావేశంలో చెప్పారు.
రాష్ట్ర విభజన నిర్ణయం గురించి ఆందోళన చెందవద్దని, ఆరు వారాల్లోగా అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని, దాన్ని ఓడిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుందని సీఎం నేతలకు సూచించారు. ఈ సమావేశంలో 21 మంది మంత్రులు, 56 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.