అసెంబ్లీకి టీ తీర్మానమూ రావాలి: కిరణ్ రెడ్డి పట్టు
మంగళవారం సచివాలయంలో పలువురు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. తీర్మానాన్ని సభలో ఓడిద్దామని, అప్పటిదాకా ఓపిక పట్టాలని ముఖ్యమంత్రి వారితో అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు ఎస్పీవై రెడ్డి, రాయపాటి సాంబశివ రావు, మంత్రులు పితాని సత్యనారాయణ, మాణిక్య వరప్రసాద్, విప్లు జగ్గారెడ్డి, రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తదితరులున్నారు.
రాష్ట్ర విభజనపై కేంద్రందూకుడుకు కళ్లెం వేయాలని కోరేందుకు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. గురువారం సాయంత్రం 40 మంది సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారయింది. అసెంబ్లీ తీర్మానం పంపించకుండా విభజన ప్రక్రియ ముందుకెళ్లడం సరికాదని, సీమాంధ్ర ప్రజల్ని పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరతామని నేతలు తెలిపారు. మరోవైపు రాష్ట్ర విభజనపై తమ వాదనను విన్పించేందుకు రాష్ట్రపతిని కలవాలని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు నిర్ణయించారు.
ఈ నెల 26న రాష్ట్రపతిని కలిసేందుకు తమకు సమయం కేటాయించాల్సిందిగా వారు రాష్ట్రపతి కార్యాలయాన్ని కోరారు. రాష్ట్రపతి ఇచ్చే సమయాన్ని బట్టి ఢిల్లీ యాత్ర తేదీని నిర్ణయించుకోవాలని నేతలు భావిస్తున్నారు. విభజన తీర్మానాన్ని అసెంబ్లీకి పంపకుండా కేంద్రం ముందడుగు వేయాలని ప్రయత్నిస్తే దానికి ఆమోదముద్ర వేయవద్దని రాష్ట్రపతిని కోరాలని వీరు నిర్ణయించారు.