''ఎన్నాళ్లని చూస్తాం.. పద్ధతి మార్చుకోవడంలేదు.. వదిలేయండంటూ'' వ్యాఖ్యానించిన సీఎం జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కోపం వచ్చింది. అయినప్పటికీ సహనం వహించారు. ప్రభుత్వంపై, అధికారులపై వ్యాఖ్యలు చేస్తున్న పార్టీ ఎంపీ గురించి నేతలతో మాట్లాడే సమయంలో ""ఎన్నాళ్లని ఎదురు చూస్తాం.. ఆయన పద్ధతి ఆయనదే.. మార్చుకోవడంలేదు.. ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంది.. చేసేదేం లేదు.. వదిలేయండి"" అంటూ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గురించే మాట్లాడారని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.
టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట
గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డి మొదటి నుంచి పార్టీలో ఇమడలేకపోతున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. వైసీపీలోని ఇతర నేతలతో మొదటి నుంచి ఆయనకు సఖ్యత లేదంటూ వార్తలు వచ్చాయి. ఆయన మరో రఘురామకృష్ణంరాజుగా మారుతున్నారని, పార్టీపై, ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి మౌనం వహించారంటున్నారు. పార్టీ సీనియర్ నేతలు పలువురు మాగుంట విషయమై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారంటున్న వైసీపీ శ్రేణులు
కొన్నాళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని, మాగుంట చేసే వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయంటున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలపై కూడా రగడ జరిగింది. ''అధికారులు మంచివారేనని, కానీ ఎక్కడో తేడా ఉందంటూ'' నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. ''ఒక్క పని కూడా ముందుకు సాగడంలేదని, అభివృద్ధి ఎక్కడా లేదని'' తాజాగా జరిగిన ఒక సమావేశంలో మాగుంట ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ లాడ్స్ నిధులకు లెక్కేది?
ఎంపీ లాడ్స్ కింద 2019లో ఇచ్చిన నిధులకు ఇంతవరకు లెక్కలు ఇవ్వడంలేదని మాగుంట ఆ సమావేశంలోనే అధికారులపై మండిపడ్డారు. కరోనా సమయం నుంచి కేంద్రం ఎంపీ లాడ్స్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. నేతలెవరూ ఆయన్ను కలవొద్దని, ఒకవేళ కటువైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ శ్రేణులెవరూ స్పందించవద్దని అధిష్టానం సూచించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో మాగుంట వైసీపీ తరఫున పోటీచేసే అవకాశాలు చాలా తక్కువని, ఆయన తిరిగి తెలుగుదేశం గూటికే చేరుకుంటారంటూ ప్రకాశం జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు.