జగన్ సర్కార్ ఇయర్ ఎండర్ గుడ్న్యూస్: రూ.703 కోట్లు విడుదల: 9 లక్షల కుటుంబాలకు బెనిఫిట్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు వినిపించారు. తొమ్మిది లక్షల మందికి పైగా లబ్దిదారులకు సంక్షేమ పథకాల లబ్దిని అందించారు. దీనికోసం 703 కోట్ల రూపాయలను విడుదల చేశారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో- ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.

నవరత్నాల అమలులో భాగంగా..
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో ముచ్చటించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ వస్తోన్నారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల కింద లబ్దిదారులకు ప్రతి సంవత్సరం నిధులను విడుదల చేస్తోన్నారు. ఈ పథకాల కింద లబ్ది పొందడానికి అర్హత ఉండీ జాబితాలో పేర్లను నమోదు చేయించుకోలేని వారు లక్షల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

9.30 లక్షలమందికి
దీనికోసం ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా 9,30,809 కుటుంబాలు అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలను అందట్లేదని నిర్ధారించింది. వారికి కూడా సంక్షేమ పథకాలను వర్తింపజేసింది. దీనికోసం 703 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వైఎస్ జగన్ ఈ మొత్తాన్ని విడుదల చేశారు. వారి ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

కులం చూడం..మతం చూడం..
రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ కుటుంబం కూడా సంక్షేమ పథకాల లబ్ది పొందకుండా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని విడుదల చేశామని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి తారతమ్యాలను చూడబోమని స్పష్టం చేశారు. కులం చూడం, మతం చూడం..ప్రాంతం చూడం..పార్టీ చూడబోమని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ నిధులను మంజూరు చేస్తామని పునరుద్ఘాటించారు.

అర్హత ఉండీ సంక్షేమ పథకం అందని కుటుంబం ఉండకూడదు..
దరఖాస్తు చేసుకోకపోవడమో..ఆ తరువాత పరిశీలనలో పొరపాట్ల వల్లనో.. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోకపోవడమో.. బ్యాంకు అకౌంట్లల్లో స్పష్టత లేకపోవడం వల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందట్లేదని గుర్తించామని అన్నారు. వారికి కూడా న్యాయం చేసేలా 703 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైఎస్ జగన్ చెప్పారు. గతంలో సంక్షేమ పథకాల్లో తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థిితి లేదని అన్నారు.

లంచం ఇవ్వక్కర్లేదు..
ప్రభుత్వమే లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని గుర్తిస్తోందని చెప్పారు. ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, అవినీతిని రూపుమాపుతున్నామని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం స్తంభించిపోయినప్పటికీ.. నిధులను సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఈ సర్వే కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, సాంకేతిక కారణాలు, పొరపాట్ల వల్ల పూర్తి అర్హత ఉండీ లబ్దిదారుల జాబితాలో చోటు దక్కించుకోలేని కుటుంబాలను గుర్తిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications