పీఆర్సీ వివాదం వేళ..: టీచర్లకు పదోన్నతులు, బదిలీలు: డెడ్లైన్ పెట్టిన వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యావ్యవస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టడానికి సమాయాత్తమైంది. ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. నూతన విద్యావిధానం అమలుపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
Recommended Video

విద్యాశాఖపై సమీక్ష..
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం వల్ల పాఠశాలలు మూతపడతాయనే అపోహ ఉందని, దాన్ని తొలగించాలని సూచించారు.

22 వేల మందికి పదోన్నతులు..
తరగతులను విలీనం చేయాల్సి ఉంటుందే తప్ప, స్కూళ్లను కాదనే విషయాన్ని ప్రజలు వివరించాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాల విద్యలో సంస్కరణలు పూర్తిగా అమల్లోకి తీసుకుని వస్తామని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించాలని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో ఏర్పాటు కానున్న కొత్త పాఠశాలల వల్ల 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయని అన్నారు.

జూన్ నాటికి పదోన్నతులు, బదిలీలు..
వారందరికీ స్పెషల్ గ్రేడ్ టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. కొత్త విద్యావిధానానికి అనుగుణంగా టీచర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఇవ్వాలని అన్నారు. జూన్ నాటికి ప్రమోషన్లు, బదిలీలను పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి మండలానికి ఒక హైస్కూల్ను జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి మండలానికి రెండు హైస్కూల్లను జూనియర్ కాలేజీలుగా మార్చాలని సూచించారు.

ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు.
.
ఇందులో ఒకటి కో- ఎడ్యుకేషన్గా మరొకటి బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాలగా మార్చాలని అన్నారు. మండల రీసోర్స్ సెంటర్ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చడానికి వైఎస్ జగన్ అనుమతి ఇచ్చారు. విద్యార్థుల అటెండెన్స్ను ఫిజికల్గా కాకుండా ఆన్లైన్ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫారసులను అమలు చేయాలని అన్నారు. విద్యార్ధుల మార్కులను కూడా ఆన్లైన్ విధానంలో ఎంట్రీ చేయాలని అన్నారు.

సదుపాయాల్లో ఫిర్యాదులపై
ఎస్ఈఆర్టీ పాఠాలను బోధించే ఉపాధ్యాయులకు నాన్ అకడమిక్ పనులకు వినియోగించవద్దని పేర్కొన్నారు. స్కూళ్ల నుంచి అందే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఏ సదుపాయాల్లోనయినా ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న చెప్పారు.

15 నుంచి నాడు-నేడు మలి విడత..
స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైఎస్ జగన్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింద రెండో విడత పనులను ఈ నెల 15వ తేదీ నుంచి మొదలుపెడతామని అధికారులు వైఎస్ జగన్కు వివరించారు. సెప్టెంబరు కల్లా పనులు పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటును విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications