మత్తుపై ఉక్కుపాదం: ఎస్ఈబీపై సమీక్షలో అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ పై దుమారం కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలని, అలాగే గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని, డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మత్తు పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనితీరుపై సమీక్షించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతోందని, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందని, ఇక లిక్కర్ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనితీరుపై సమీక్షించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యం నియంత్రణలో భాగంగా ధరలు పెంచామని, ఇక రాష్ట్రంలో మూడింట ఒక వంతు లిక్కర్ షాపులను మూసివేశామని, బెల్టుషాపులను,పర్మిట్ రూమ్ లను తీసేశామని పేర్కొన్నారు.
మద్యం తయారీ, అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపండి
రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ ను నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గించగలిగామని, బీర్ సేల్స్ నెలకు 17 లక్షల కేసుల నుంచి ఏడు లక్షల కేసులకు తగ్గాయని స్పష్టం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తుంటే అక్రమ మద్యం తయారీ, రవాణా ఇబ్బందికరంగా మారిందని, దీనిని అడ్డుకోవాలని ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలని, క్రమం తప్పకుండా దాడులు కొనసాగించాలని పేర్కొన్నారు. పోలీసులతో కలిసి సమన్వయంతో పని చెయ్యాలని సూచించారు.
డ్రగ్స్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు, యూనివర్సిటీలపై నిఘా పెట్టండి
ఇక రాష్ట్రంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, ఎక్కడైనా డ్రగ్స్ కు సంబంధించిన అనుమానాలుంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, క్రమం తప్పకుండా యూనివర్సిటీలు, కాలేజీలపై మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో గుట్కా విక్రయాలు,రవాణా పైన దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా మత్తు పదార్ధాలు కనిపించటానికి వీల్లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆ దిశగా అధికారులు పని చెయ్యాలన్నారు.
ఇసుక అధిక ధరకు అమ్మితే చర్యలు తీసుకోండి
ఇసుకను నిర్దేశించిన రేట్ల కన్నా ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని ఎస్ఈబీ అధికారులకు సీఎం జగన్ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మరిన్ని రీచ్ లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలని పేర్కొన్న జగన్, ఎస్ఈబి కాల్ సెంటర్ నెంబర్ పై బాగా ప్రచారం చేయాలన్నారు. అధిక రేట్లకు ఇసుక ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు కాల్ సెంటర్ నెంబర్ కు కాల్ చేసేలా ప్రజల్లోకి నెంబర్ ను తీసుకువెళ్లాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఇసుక విషయంలో వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నారు.
Recommended Video
సీఎం జగన్ కు ఎస్ఈబీ కార్యాకలాపాల, నమోదు చేసిన కేసుల నివేదిక
ఈ సమీక్ష సమావేశంలో ఎస్ఈ బి అధికారులు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎస్ఈబీ కార్యకలాపాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి నివేదికను అందించారు. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా, తయారీ లకు సంబంధించి 1,20,822 కేసులను నమోదు చేశామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి రాష్ట్రంలో 12,211 కేసులు నమోదయ్యాయని, గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 220 కేసులు నమోదయ్యాయని తెలిపారు.