ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం వైఎస్ జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్హౌస్లో సోమవారం సాయంత్రం సుమారు గంట సేపు ప్రధాన న్యాయమూర్తితో జగన్ సమావేశమయ్యారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో సీఎం సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఏపీ హైకోర్టుకు నూతన భవన నిర్మాణ పనులు, పలు అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. హైకోర్టు ఉన్నత పరిపాలనా అధికారులు, రాష్ట ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, ఏప్రిల్ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితో పాటు, పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయ సహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ-కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. వీటికి సంబంధించి రాష్ట్ర నుంచి నివేదించనున్న అంశాలపై ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చర్చించారు.