ఏకపక్షమా..? అఖిలపక్షమా..? : రాజధాని నిర్ణయంపై జగన్ ఎటువైపు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై నేడు జరుగుతున్న కేబినెట్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను విశాఖపట్నంకు తరలించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుందా..? లేక నిర్ణయాన్ని వాయిదా వేస్తారా..? అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో దీనిపై అఖిలపక్ష భేటీని నిర్వహించాలా..? అన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలకు తావు ఇవ్వకుండా అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అఖిలపక్షంతో పాటు పలు ప్రజాసంఘాలను కూడా భేటీకి ఆహ్వానించే అవకాశం ఉంది.

అఖిలపక్ష సమావేశం..
రాజధానిపై టీడీపీ,జనసేన,బీజేపీ ఇప్పటికే తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేశాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని ఆయా
పార్టీల నేతలు అక్కడి రైతులతో కలిసి ఆందోళనల్లో కూడా పాల్గొంటున్నారు. కాబట్టి అఖిలపక్ష భేటీలోనూ ప్రతిపక్షాలు అదే వాదనను మరోసారి ప్రభుత్వానికి
వినిపించవచ్చు. అయితే అఖిలపక్షం ఇందుకు ఒప్పుకుంటుందా లేదా అన్నది పక్కనపెడితే.. ఏకపక్ష నిర్ణయం అన్న మచ్చ పడవద్దన్న యోచనలో
ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక
కేబినెట్ భేటీలో రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడే రాజధాని తరలింపుపై ప్రకటన చేయాలా..?
లేక రాజధాని ప్రాంత రైతుల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయాన్ని వాయిదా వేయాలా..? అన్న అంతర్మథనం ప్రభుత్వంలో నెలకొన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ కేబినెట్ భేటీ తర్వాత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటే.. ముఖ్యమంత్రి జగనే స్వయంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారా..? లేక మంత్రులతో మీడియా
సమావేశం పెట్టిస్తారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.

సచివాలయ ఉద్యోగులు ఏమంటున్నారు..
మరోవైపు సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు. రాజధాని తరలింపుపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించనున్నారు.
రాజధాని తరలింపుపై కొంతమంది ఉద్యోగులు సుముఖతతో ఉండగా.. మరికొంతమంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సీఎంతో చర్చించే అవకాశం
ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చి అమరావతిలో అలవాటుపడేందుకే చాలా సమయం పట్టిందని.. ఇప్పుడు రాజధానిని విశాఖకు తరలిస్తే అద్దె ఇళ్లు వెతుక్కోవడం,పిల్లలను స్కూళ్లలో జాయిన్ చేయడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పే అవకాశం ఉంది.

విశాఖకు తరలిస్తే..
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను విశాఖకు తరలించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ దాదాపుగా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే
రాజధాని ప్రాంత రైతుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది కేబినెట్లో చర్చించనున్నారు. రిటర్నబుల్ ప్లాట్స్కే ప్రభుత్వం మొగ్గుచూపే
అవకాశం ఉందంటున్నారు. అలాగే అమరావతిలో భూముల కొనుగోలుకు ఆలిండియా సర్వీస్ అధికారులు చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications