విశాఖలో విదేశీ ప్రతినిధులకు జగన్ డిన్నర్: సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్
విశాఖపట్నం: విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇటీవలే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మకమైన జీ20 సదస్సుకు వేదికగా మారింది. జీ20 సమ్మిట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సమావేశం ఇక్కడ ఏర్పాటైంది. ర్యాడిసన్ బ్లూ హోటల్ ఏర్పాటైన ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అత్యున్నత స్థాయి సమ్మిట్ ఇది. ఇందులో కీలకమైన ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యులు విశాఖపట్నంలో సమావేశం అయ్యారు. రెండు రోజుల కొనసాగుతుందీ సమ్మిట్. జీ20లో సభ్య దేశాల నుంచి పలువురు సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సమ్మిట్ లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్- ఈ సాయంత్రమే విశాఖపట్నానికి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ర్యాడిసన్ బ్లూ హోటల్కు చేరుకున్నారు. సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని, ప్రతి ఒక్కరికీ నివాస వసతిని కల్పించాలనే లక్ష్యంతో పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తోన్నామని వివరించారు.

తీర ప్రాంతాల్లో ఓడరేవుల నిర్మాణం, భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సహా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రోడ్ కనెక్టివిటీని కల్పిస్తోన్నామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల వ్యవధిలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని వైఎస్ జగన్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల నివాసాలు నిర్మితమౌతోన్నాయని, దీనివల్ల గ్రామస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని అన్నారు.

ఇళ్ల నిర్మాణాల వల్ల గ్రామస్థాయిలో వేలాదిమందికి ఉపాధి సైతం లభించినట్టయిందని పేర్కొన్నారు. సుస్థిరమైన అభివృద్ధిని సాధించడానికి సరైన దిశానిర్దేశం అవసరమౌతుందని పేర్కొన్నారు. అనంతరం జీ20 ప్రతినిధులకు ఇచ్చిన విందులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. వారితో కలిసి భోజనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. మంత్రులు ఆర్ కే రోజా, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications