విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఉచితంగా కాన్వా, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ప్రపంచ ప్రసిద్ధ డిజిటల్ డిజైన్ ప్లాట్ఫామ్ కాన్వా సేవలను పూర్తి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కాన్వా సంస్థతో ఏపీ విద్యాశాఖ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో దేశంలోనే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ విప్లవాత్మక అడుగు వేసింది.
ప్రభుత్వ స్కూల్స్ లో కాన్వాసేవలు
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కాన్వా టూల్స్ సాయంతో ఆకర్షణీయమైన ప్రజెంటేషన్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు, గ్రాఫిక్స్ డిజైన్లు మరియు ప్రాజెక్ట్ ఆధారిత లెర్నింగ్ మెటీరియల్ను సులభంగా తయారు చేసుకోవచ్చు. డిజిటల్ సాంకేతికత, కమ్యూనికేషన్ స్కిల్స్, డిజైన్ థింకింగ్ మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం.

కాన్వా ఫర్ ఎడ్యుకేషన్ ప్రీమియం వెర్షన్ పై నారా లోకేష్
దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, "ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి డిజిటల్ సాధనాలను అందించడం ద్వారా డిజిటల్ గ్యాప్ ను విద్యార్థులలో తగ్గించవచ్చు. విద్యార్థులు కేవలం టెక్నాలజీని ఉపయోగించేవారు కాకుండా, కొత్త సాంకేతికతలను సృష్టించే సామర్థ్యం కలిగిన ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం" అని తెలిపారు. ఈ ఒప్పందం కింద కాన్వా ఫర్ ఎడ్యుకేషన్ ప్రీమియం వెర్షన్ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు.
నాలుగు దశల్లో కాన్వా వినియోగం
ఏపీ పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచి ప్లాట్ఫామ్లో ఏఐ ఆధారిత సేఫ్గార్డ్స్, ప్రైవసీ ప్రొటెక్షన్ మరియు ఉపాధ్యాయుల నియంత్రణలో ఉండే రోల్-బేస్డ్ అనుమతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నాలుగు దశల్లో విభజించి అమలు చేయనున్నారు. మొదటి దశలో అకౌంట్ క్రియేషన్ మరియు ఆన్బోర్డింగ్ ప్రక్రియలు జరుగుతాయి.
ఉపాధ్యాయులకు శిక్షణ, లీప్, గూగోల్ వర్క్ స్పేస్ తో అనుసంధానం
తర్వాత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, తరగతి గదుల్లో ఆచరణాత్మక అమలు చేస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (SCERT) తెలుగు, ఆంగ్ల భాషల్లో అనుకూల టెంప్లేట్లను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ను రాష్ట్రం యొక్క 'లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP)' యాప్, గూగుల్ వర్క్స్పేస్ మరియు పాఠశాలల్లో ఉపయోగించే క్రోమ్బుక్లతో అనుసంధానం చేయాలని ప్రణాళికలు ఉన్నాయి.
విద్యార్థులకు, టీచర్లకు లబ్ది
లక్షలాది మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ సౌకర్యం ద్వారా లబ్ధి పొందుతారు. ఈ చర్యతో ఏపీలో డిజిటల్ విద్యాబోధనకు కొత్త ఊపు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను విద్యారంగంలోకి తీసుకురావడం ద్వారా యువతను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందుండటం విశేషం.













Click it and Unblock the Notifications