జగన్ మేనిఫెస్టో: అమ్మఒడి, పెన్షన్ పెంపు - రైతు భరోసా రూ 80 వేలు...!!
ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసారు. 2019 లో ఇచ్చిన హామీలను నిష్టగా అమలు చేసామని చెప్పారు. చెప్పినవి అన్నీఅమలు చేసి ప్రజల్లో హీరోగా నిలిచే అవకాశం దక్కిందన్నారు. 2014లో చంద్రబాబుతో మోసపూరిత హామీలతో పోటీ పడలేక ఓడిపోయానని వ్యాఖ్యానించారు. అమలు చేసేవే చెబుతున్నామని..చెబితే ఖచ్చితంగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మరో సారి తన మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కీలక హామీలు ప్రకటించారు.
అయిదేళ్ల కాలంలో ఇలా
2019-24 వరకు అయిదేళ్ల కాలంలో ఇచ్చిన హామీల అమలులో ఏనాడు కారణాలు చెప్పలేదని జగన్ చెప్పారు. కరోనా, ఆర్దిక కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయలేదన్నారు. 2.70 లక్షల కోట్లు పథకాల కోసం ఖర్చు చేసామని వెల్లడించారు. హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేసారని జగన్ వ్యాఖ్యానించారు. 2014-19 కాలంలో 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగా..తన హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ చెప్పుకొచ్చారు.

2014-19 వరకు అమలు చేసిన పథకాలకు అన్నింటికి కలిపి దాదాపు రూ 70 వేల కోట్లు ఖర్చు అయ్యేదని వివరించారు. చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ 1 లక్షా 21,619లక్షల కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఖచ్చితంగా అమలు చేయాల్సిన వాటితో కలిపితే చంద్రబాబు పథకాల ఖర్చు కోసం 1,50,178 కోట్లు అవసరమని జగన్ విశ్లేషించారు.
అమ్మ ఒడి పెంపు
అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. నవరత్నాల కొనసాగింపు పైన జగన్ హామీ ఇచ్చారు. అభివృద్ధి,సుపరిపాలన అందిస్తామని ప్రకటించారు. కొనసాగుతున్న పోర్టులు, మౌళిక వసతులను మరింతగా విస్తరిస్తామని చెప్పారు. వైఎస్సార్ చేయూత కింద ప్రస్తుతం ఇస్తున్న నాలుగేళ్ల కాలంలో 75 వేల నుంచి 1.50 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాపు నేస్తం కింద ఇక నుంచి 60 వేల నుంచి లక్షా 20 వేలకు కొనసాగిస్తామని ప్రకటించారు.
అమ్మఒడి పరిధి రూ 15 వేల నుంచి 17 వేలకు పెంపుకు జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా కింద 3 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 4 విడతల్లో 45 వేల నుంచి లక్షా 5 వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీగా ప్రకటించారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటి పట్టాలు అందిస్తామని చెప్పారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేస్తున్న సీఎం @ysjagan గారు! #VoteForFan #YSRCPNavaratnaluPlus https://t.co/uC42c5eKVn
— YSR Congress Party (@YSRCParty) April 27, 2024
పెన్షన్ - రైతు భరోసా పెంపు
విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, సామాజిక భద్రత, నాడు - నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత లక్ష్యంగా పాలన కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ ను రూ 3 వేల నుంచి రూ 3,500 కి పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. 2028, 2029 జనవరిలో రెండు విడతలుగా పెన్షన్ పెంచుతామని వెల్లడించారు.
66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు వివరించారు. వైయస్సార్ కళ్యాణమస్తు-షాదీ తోఫా కొనసాగిస్తామని ప్రకటించారు. రైతులకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము రూ 13,500గా ఉండగా...ఈ సారి ఈ మొత్తాన్ని రూ 16 వేలకు పెంచి అయిదేళ్ల కాలంలో రూ 80 వేలు ఇస్తామని ప్రకటించారు. రైతులకు ప్రస్తుతం అందిస్తున్న అన్ని రకాల లబ్ది కొనసాగుతుందని జగన్ వెల్లడించారు. మత్స్యకార, వాహనమిత్ర కొనసాగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications