ఎన్నికలు అనేది సెకండరీ - మన లక్ష్యం అదే: సీఎం జగన్..!!
పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి.. తమ పిల్లలకు గౌరవ ప్రదంగా పెళ్లీళ్లు చేసి.. పిల్లలకు వివాహ జీవితాలను మొదలుపెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైనవారని భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు.
నిధులు విడుదల : వైయస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది జంటలకు ఈరోజు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వైయస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు.

ఈ పథకంలో ఇప్పటి వరకు మూడు త్రైమాసికాల్లో ఆర్థికసాయం అందజేయడం జరిగిందన్నారు. 2022 అక్టోబర్నుంచి మొదలుపెడితే ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు అవుతుందని వెల్లడించారు. ఒక పథకం తీసుకువస్తే దాని వెనుక ఒక ఉద్దేశం, సంకల్పం ఉండాలన్నారు. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిన పథకం ఈ కళ్యాణలక్ష్మి, షాదీ తోఫాగా వివరించారు.
వాళ్లంతా చెప్పినా : వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకానికి పదో తరగతి ఉత్తీర్ణత, 18 సంవత్సరాలు, 21 సంవత్సరాల నిబంధన ఎందుకు పెట్టాలని తనతో చాలా మంది అన్నారని సీఎం వెల్లడించారు 10 తరగతి ఉత్తీర్ణత నిబంధన లేకపోతే మనకు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పినట్లు వివరించారు. ఓట్లు, ఎన్నికలు అనేది సెకండరీగా పేర్కొన్న సీఎం జగన్.. లీడర్లుగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలని స్పష్టం చేసారు.
విజన్ అనేది చాలా ముఖ్యమన్నారు. 10వ తరగతి సర్టిఫికెట్ ఏరోజు అయితే మనం కంపల్సరీ చేస్తామో.. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలనే నిబంధన పెడతామో అప్పుడు బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోవడం, టెన్త్ సర్టిఫికెట్ నిబంధన వల్ల ప్రతి కుటుంబం కూడా తమ పిల్లలను చదివించడం కోసం ఇది కూడా మరింతగా ఊతమిచ్చే కార్యక్రమంలో భాగం అవుతుందని చెప్పారు.

విద్యకు ప్రాధాన్యత : తమ పిల్లలను చదివించే విధంగా ప్రతి తల్లిని ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి పథకం అడుగులు వేయిస్తోందన్నారు. మనబడి నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. ఆ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులు వచ్చాన్నారు. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధనను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఐఎఫ్బీ ప్యానల్తో బోధన జరుగుతోందన్నారు.
3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పిన సీఎం జగన్... పిల్లలకు ఇంగ్లిష్ చదువులు సులభంగా అర్థమయ్యేలా బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్ తెచ్చామన్నారు. ఈరోజు మనం చిత్తశుద్ధితో, మోటివేషన్తో, పారదర్శకతతో ప్రతి ఒక్కరికీ మంచి జరిగించాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications