స్టాలిన్ ఓడిపోయిన సీట్ లో ఈవీఎంలల్లో గోల్ మాల్- రీవెరిఫికేషన్ షురూ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 14 పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును పరిశీలించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రత్యేక తనిఖీ ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దాఖలు చేసిన దరఖాస్తు ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
కొళత్తూర్ నియోజకవర్గం.. స్టాలిన్ కు కంచుకోట. 2011, 2016, 2021 ఎన్నికల్లో ఆయన హ్యాట్రిక్ కొట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. 8,795 ఓట్ల తేడాతో అధికార టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో విజేతగా నిలిచిన బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్ కు 74,202 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఫలితంపై ముందు నుంచీ స్టాలిన్ అసంతృప్తితో ఉంటూ వచ్చారు. ఈవీఎంల పనితీరును పరిశీలించాలని ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు.

దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించింది. కొద్దిసేపటి కిందటే కొళత్తూర్ ఈవీఎంలల్లో ఉండే మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆరంభించింది. ఇది.. ఈవీఎంల భద్రత, సాఫ్ట్వేర్ పనితీరును పరిశీలించేందుకు మాత్రమేనని, దీన్ని రీకౌంటింగ్ గా భావించరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈ తనిఖీ.. చెన్నై చింతాద్రిపేట్టైలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో ఆరంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగుతోంది.
ఈ వెరిఫికేషన్ లో భాగంగా మొత్తం 42 బ్యాలెట్ పేపర్లు, 14 కంట్రోల్ యూనిట్లు, 14 వీవీప్యాట్ లను క్షుణ్ణంగా పరీక్షిస్తోన్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన ఇతర అభ్యర్థులందరూ కూడా స్వయంగా హాజరై ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని ఈసీ తెలిపింది. ఈ మేరకు వారందరికీ ఆహ్వానాలను సైతం పంపింది. బెల్ ఇంజినీర్లు మొదట ఈవీఎంలలో భద్రపరిచిన ఫలితాలను స్క్రీన్పై ప్రదర్శిస్తారు.
అభ్యర్థులు, వారి తరఫు ప్రతినిధులు ఈ ఫలితాలను తాము గతంలో నమోదు చేసుకున్న ఫారం-20 రికార్డులతో సరిపోల్చవచ్చు. ఇది ముగిసిన తర్వాత పాత డేటాను పూర్తిగా తొలగిస్తారు. అనంతరం బేసిక్ మాక్ పోల్ నిర్వహిస్తారు. అనంతరం రెండో విడత మాక్ పోల్లో భాగంగా ప్రతినిధులు కనీసం 500 నుండి గరిష్టంగా 1,400 ఓట్లను టెస్ట్ ఓట్లుగా వేసి ఈవీఎంల పనితీరును పరీక్షిస్తారు. చివరగా మైక్రోప్రాసెసర్ ధృవీకరణ పూర్తయిన తర్వాతే వాటికి సర్టిఫికేషన్ ఇస్తారు.
#WATCH | Tamil Nadu: Verification of the microcontroller in the EVM used for the Kolathur Assembly constituency is being carried out today.
— ANI (@ANI) July 29, 2026
The exercise is being conducted following a request by former Chief Minister and Kolathur constituency candidate M. K. Stalin. pic.twitter.com/g4V1tyDYwl
కొళత్తూర్తో పాటు కాంచీపురం జిల్లాలోని ఉత్తిరమేరూర్, విరుదునగర్ జిల్లాలోని రాజపాళయం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈవీఎంల తనిఖీలు జరగనున్నాయి. ఒక్క ఓటు తేడాతో ఫలితం తారుమారైన శివగంగ జిల్లా తిరుపత్తూర్ నియోజకవర్గ ఈవీఎంల తనిఖీ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఇక్కడ డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్ ఓటమికి సంబంధించిన ఎన్నికల పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు పరిధిలో విచారణలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.












Click it and Unblock the Notifications