వైభవంగా గిరి ప్రదక్షిణ, భారీ జనసందోహం - భక్తుల పాదాలకు మర్దనా సేవ..!!
సింహాచలం జనసంద్రంగా మారింది. గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులు సింహాద్రి అప్పన్న నామస్మరణతో ముందుకు కదులుతున్నారు. దీంతో గిరి ప్రదక్షిణ మార్గాలన్నీ కిటకిటలాడుతున్నాయి. 32 కిలో మీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల పాదాలకు స్వచ్చంద సంస్థలు మర్దనా సేవ చేస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు.
సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సింహాద్రి అప్పన్న నామస్మరణతో గిరి ప్రదక్షిణ మార్గం మార్మోగిపోతోంది. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో 32 కిలోమీటర్ల మార్గమంతా కిటకిటలాడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక సమీప రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు గిరిప్రదక్షిణ కోసం వచ్చారు. సముద్ర స్నానం అనంతరం భక్తుల కోసం అప్పుఘర్ సమీపంలో షవర్ బాత్ ఏర్పాటు చేసారు. కొండ దిగువన ఉన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు.

సింహాచలం గిరి ప్రదిక్షణకు పోటెత్తిన భక్తజనం
పాదయాత్ర చేస్తున్న భక్తుల కోసం గిరి ప్రదక్షిణ మార్గంలో 33 చోట్ల వైద్య శిబిరాలు, 26 అంబులెన్స్లను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వారికి అప్పన్న ఉచిత దర్శన సౌకర్యం కల్పించారు. 32 కిలోమీటర్ల ప్రదిక్షణ పూర్తి చేసుకుని భక్తులు స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
మార్గమధ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భక్తులకు అల్పాహారం, తాగునీరు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కాగా, గిరి ప్రదక్షిణలో అలసిన భక్తుల పాదాలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పాద మర్దన సేవా చేపట్టారు. నువ్వుల నూనెలో ప్రత్యేక వనమూలికలు మరిగించి తయారుచేసిన నూనెతో భక్తుల పాదాలకు మర్దనా చేస్తున్నారు. ఈ సేవ భక్తులకు ఎంతో ఉపశమనంగా మారింది.












Click it and Unblock the Notifications