వైఎస్ జగన్-షర్మిల మళ్లీ ఫేస్ టు ఫేస్?: సొంత జిల్లాకు సీఎం: షెడ్యూల్ ఇదే..
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి తన సొంత జిల్లా కడప గడపను తొక్కనున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయింది. మినిట్స్ ఇంకా వెలువడాల్సి ఉంది. వైఎస్ జగన్.. పర్యటనకు రానున్నట్లు జిల్లా అధికార, పోలీసు యంత్రాంగానికి సమాచారం అందింది. ఆయన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి అధికారులు సమాయాత్తమౌతున్నారు.

నెలరోజుల్లో రెండోసారి..
తన సొంత జిల్లా పర్యటనకు బయలుదేరి రావడం వైఎస్ జగన్కు నెల రోజుల వ్యవధిల ఇది రెండోసారి. కిందటి నెల ఆయన జిల్లాలో పర్యటించారు. బంగాళాఖాతంలో సంభవించిన వరుస అల్పపీడనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో పర్యటించారు. కడప, చిత్తూరు, నెల్లూరులను సందర్శించారు. వరద ముంపు గ్రామాల్లో పర్యటించారు. బాధితులను కలుసుకున్నారు. వారికి తక్షణ సహాయాన్ని అందించేలా అప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేశారు.

మూడు రోజుల పాటు..
ఈ సారి ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి పులివెందులకు వెళ్లనున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి స్వస్థలానికి వెళ్లడం వైఎస్ జగన్ ఆనవాయితీ. కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతారు. పులివెందుల చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. వైఎస్ కుటుంబ సభ్యులందరూ ఈ ప్రార్థనలకు హాజరవుతారు.

షర్మిల దూరంగా..
తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, బావ అనిల్ కుమార్, చిన్నమ్మ సౌభాగ్యమ్మ, డాక్టర్ సునీతతో కలిసి పాల్గొంటారు. కాగా- ఇదే వేడుకల్లో ఈ సారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల పాల్గొనే అవకాశాలు దాదాపు లేకపోవచ్చు. స్వస్థలంలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలకు ఆమె దూరంగా ఉండొచ్చని తెలుస్తోంది. దీనికి కారణం- వైఎస్ షర్మిల పాదయాత్ర. ఈ నెల 19వ తేదీ నుంచి షర్మిల మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు.

రైతు ఆవేదన యాత్ర పేరుతో..
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఆమె తన పాదయాత్రకు తాత్కాలికంగా పుల్స్టాప్ పెట్టారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున.. మళ్లీ జనం బాట పట్టనున్నారు. రైతు ఆవేదన యాత్రను చేపట్టనున్నారు. ఆదివారం నుంచి ఈ యాత్ర మొదలు కానుంది. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శించనున్నారామె. దీనికి అవసరమైన సమగ్ర ప్రణాళిక, రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు.

యాత్ర నేపథ్యంలో..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనుసరిస్తోన్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల బలవన్మరణానికి పాల్పడిన ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శిస్తామని, వీలైనంత సహాయం చేస్తామని వైఎస్ షర్మిల ఇదివరకే ప్రకటించారు. ఈ రైతు ఆవేదన యాత్ర నేపథ్యంలో- ఆమె తన పుట్టింట్లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కాలేరని చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇటీవలే ప్రత్యేకంగా లోటస్పాండ్లోని తన నివాసంలో ఈ పండగ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ప్రత్యేకంగా లోటస్పాండ్లో..
వైఎస్ విజయమ్మ సహా పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. పులివెందులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడటం వల్లే ఆమె ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహించారని అంటున్నారు. కాగా- తన మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఇడుపుల పాయ గెస్ట్హౌస్లో బస చేస్తారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళి అర్పిస్తారు. ఈ మూడు రోజుల పాటు అక్కడి నుంచే పరిపాలన సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇడుపుల పాయ, పులివెందులల్లో..
కడప, రాజంపేట లోక్సభ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషా, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆయనను కలుసుకుంటారు. పులివెందులలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలకు హాజరవుతారు. అనంతరం క్రిస్మస్ రోజు సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications