తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని వీడనున్న వైఎస్ జగన్: బద్వేలు గెలుపు ఇచ్చిన ఊపుతో..!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక జనం బాట పట్టనున్నారు. రాష్ట్రం నలుమూలలా పర్యటించనున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకోనున్నారు. వారితో మమేకం కానున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించనున్నారు. డెలివరీ సిస్టమ్లో చోటు చేసుకున్నట్టుగా భావిస్తోన్న లోపాలను సవరించే ప్రయత్నం చేస్తారు. మరింత మెరుగైన పరిపాలనను అందించడానికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రజల నుంచి స్వీకరిస్తారు.

మూడువారాల పాటు..
వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటన కనీసం మూడు వారాల పాటు లేదా అంతకుమించి ఉండొచ్చని తెలుస్తోంది. తన పుట్టినరోజు- డిసెంబర్ 21వ తేదీ నుంచి ఈ పర్యటనకు పూనుకుంటారని సమాచారం. జనం మధ్య తన పుట్టినరోజును జరుపుకొనేలా కార్యాచరణను రూపొందించారని అంటున్నారు. ఏదైనా ఒక గ్రామ సచివాలయంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ద్వారా తన రాష్ట్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. సంక్రాంతి పండగ వరకు ఈ పర్యటలను కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గ్రామ సచివాలయాలు కేంద్రబిందువుగా..
డెలివరీ సిస్టమ్ పనితీరు, అమలును స్వయంగా పర్యవేక్షించడానికి వైఎస్ జగన్- గ్రామ/వార్డు సచివాలయాలను కేంద్రబిందువుగా చేసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ పరిపాలన సాగుతోంది. ప్రతి రెండువేల జనాభా ఉన్న గ్రామానికి, వార్డుకు సచివాలయాలను ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. గ్రామ/పట్టణ స్థాయి పరిపాలనకు ఈ సచివాలయాలే ఇరుసుగా మారాయి. అదుకే- వాటిని సందర్శించడం ద్వారా గ్రామ స్థాయిలో పరిపాలను మరింత బలోపేతం చేసినట్టవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

రచ్చబండ పేరుతో ఎప్పటి నుంచో..
రచ్చబండ పేరుతో వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- వాటిని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తోన్నారనే అభిప్రాయం కూడా ఉంది. తాను పర్యటనలకు వెళ్తే జనం వేలాదిగా జనం గుమికూడుతారని, అది వైరస్ వ్యాప్తికి కారణం కావచ్చనే ఉద్దేశంతో ఆయన తిరుపతి లోక్సభ, బద్వేలు శాసన సభ ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదు.

అనుకూల పరిస్థితులు..
ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఆలస్యం చేయకుండా జనం బాట పట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా- రెండున్నరేళ్ల పాలన కూడా పూర్తి అయింది. ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి?, వ్యతిరేక గాలి వీస్తోందా?, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు, వారి పట్ల ప్రజల వైఖరి, స్థానిక పార్టీ నాయకత్వంపై ఫిర్యాదులు.. ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

మంత్రివర్గ విస్తరణ..
జనం బాట పట్టడానికి ముందే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం లేకపోలేదు. ఇప్పుడున్న మంత్రులందరినీ తొలగించి- కొత్త వారికి అవకాశం ఇస్తామని వైఎస్ జగన్- తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే ప్రకటించారు. రెండున్నరేళ్ల తరువాత పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అప్పట్లోనే స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరొచ్చని చెబుతున్నారు. ఆ తరువాత గ్రామ సచివాలయాల సందర్శనకు వెళ్తారని తెలుస్తోంది.
Recommended Video

నాలుగు దశల్లో..
వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటన నాలుగు దశల్లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ.. ఇలా ఒక్కో ప్రాంతాల్లో ఒక్కోదశలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఇలా దశలవారీగా గ్రామ సచివాలయాల స్థాయిలో పర్యటించడం ద్వారా సంక్షేమ పథకాల డెలివరీ వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షించడానికి వీలు కలుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ప్రభుత్వం వెంటే ఉన్నారనడానికి బద్వేలులో తాజాగా అందుకున్న ఘన విజయం.. స్పష్టం చేసిందని, ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో ఆయన ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్తారని స్పష్టం చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications