మధ్య తరగతి కోసం జగన్ సర్కార్ మెగా ప్రాజెక్ట్: నేడు ఈ ఆరు జిల్లాల్లో ప్రారంభం: ఈజీగా బ్యాంక్ లోన్లు
గుంటూరు: మధ్యతరగతి కుటుంబీకులు తక్కువ ధరలో ఇళ్లను నిర్మించుకోవడానికి ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్ట్.. ఇవ్వాళ అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ మెగా ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టబోనున్నారు. గుంటూరు జిల్లా నవులూరులోని టౌన్షిప్ను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇది తొలి దశ ప్రాజెక్ట్.

స్మార్ట్ టౌన్షిప్స్..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చౌక ధరలకు ఇళ్ల స్ధలాలను విక్రయించడానికి ఈ స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే. ప్రభుత్వమే ఈ స్థలాలను విక్రయించనుంది. తొలిదశలో ఆరు జిల్లాల్లో ఇది కార్యాచరణలోకి వస్తుంది. దశలవారీగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తుంది ప్రభుత్వం. పేదల కోసం ఇప్పటికే జగన్ సర్కార్ పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులుగా గుర్తించిన 30 లక్షలమందికి స్థలాలకు సంబంధించిన పట్టాలను మంజూరు చేసింది. ఆర్థిక స్థోమత లేని వారికి ఇళ్లు కూడా కట్టిస్తోంది.

ఈ ప్రాంతాల్లో..
మధ్యతరగతికి తక్కువ ధరలో ఇళ్ల స్ధలాలలను విక్రయించడానికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నవులూరుతో పాటు కడపలోని రాయచోటి దిగువ అంబవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి జమ్మలపాలెం, అనంతపురం జిల్లా ధర్మవరం కుంతూరు రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని ఈ స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టులు తొలిదశలో అందుబాటులోకి రానున్నాయి.

బ్యాంకుల నుంచి లోన్లు..
దరఖాస్తుల స్వీకరణను బుధవారం నుంచి మొదలు పెట్టనున్నారు అధికారులు. స్థానిక మున్సిపల్ అధికారులు దీన్ని పర్యవేక్షిస్తారు. లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు. వాటిని కొనుగోలు చేసిన వారు సంవత్సరం లోగా నాలుగు విడతల్లో ఆ మొత్తాన్ని చెల్లించే వీలును కల్పించింది ప్రభుత్వం. ఒకేసారి చెల్లించవచ్చు. అలా చెల్లించిన వారికి అయిదు శాతం రాయితీని కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఇళ్లు కట్టుకోవడానికి అవసరమైన రుణాలను బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశం కూడా ఉంది.

వెబ్సైట్ ఇదే..
మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు ఇళ్ల స్ధలాలను అందుబాటులోకి తీసుకుని రావడం పట్ల ఈ ప్రాజెక్ట్కు మంచి స్పందన లభించింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో భాగంగా ప్రతీ లే అవుట్ లోనూ 40 నుంచి 60 అడుగుల బీటీ రోడ్లు అభివృద్ధి చేస్తారు. ఈ లే అవుట్లలో నిరంతర నీటి సరఫరా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్, ఫుట్ పాత్ నిర్మిస్తారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్, డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్ కావాలంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్ వెబ్ సైట్ https://migapdtcp.ap.gov.inలో బుక్ చేసుకోవాలి.












Click it and Unblock the Notifications