చంద్రబాబుపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు: ఆలోచిస్తామన్న ఏసీపీ!..
తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులను కించపరిచే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయవాడ: జూన్ 2.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల నడుమ స్పష్టమైన తేడా కనిపించే రోజు. ఒకరికి వేడుక.. మరొకరికి బ్లాక్ డే. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. బ్లాక్ డే జరుపుకోడం అర్థరహితం అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వారు విమర్శించిన సంగతి తెలిసిందే.
కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం బ్లాక్ డే పేరిట నవనిర్మాణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో తన మెరుగైన పాలన వల్లే తెలంగాణ ప్రజలు ఇప్పుడు మెరుగైన జీవనాన్ని అనుభవిస్తున్నారని అర్థం వచ్చేలా నవనిర్మాణ వేదిక నుంచి ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణలో ఫిర్యాదు నమోదైంది. తెలంగాణలోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో టీఎస్ ముస్లిం పొలిటికల్ జేఏసీ, కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలోని సభ్యులు ఏసీపీ సింధు శర్మను కలిసి ఆయనపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఏపీలో బ్లాక్ డేగా జరుపుకోవాలని వ్యాఖ్యానించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులను కించపరిచే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టేనిచ్చేది లేదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఏసీపీ సింధు శర్మ.. న్యాయ నిపుణులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.