ఫైర్ బ్రాండ్ రోజా వంతు వచ్చింది..బిగుసుకుంటున్న ఉచ్చు..!
ఏపీలో వైసీపీ నేతలు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ఈవీఎం పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్నారు.టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దమవుతోంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వంటివారు కేసులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా వంతు వచ్చినట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల గోల్మాల్పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది.

ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యాపాట్యా సంస్థ సంస్థ సీఈవో ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఐడీ..ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను ఆదేశించారు.ఇదే జరిగితే.. రోజా, కృష్ణదాస్లు విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఈ ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడలశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విమర్శలు వచ్చాయి.నిధుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి తనపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications