దుష్టత్రయం బిజెపి,టిడిపి,వైసిపిలను ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యం:తులసిరెడ్డి
విజయవాడ:వచ్చే ఎన్నికల్లో దుష్టత్రయమైన బిజెపి, టిడిపి, వైసిపిలను ఓడించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎపిసిసి ఉపాధ్యక్షులు ఎన్.తులసిరెడ్డి అన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీల విధానాలు ఒకటే అని వ్యాఖ్యానించారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రకు ప్రయోజనం చేకూర్చేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన వరాలు నేటికీ నెరవేరలేదని తులసిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే వాటిని ఖచ్చితంగా అమలు చేసేవారమని అన్నారు.

రాష్ట్ర ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు భయపడి తెలుగుదేశం ప్లేటు ఫిరాయించిందన్నారు. బిజెపితో టిడిపి తాత్కాలిక రాజకీయ శతృత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి టీడీపీ అధికార మిత్రపక్షమని..వైసీపీ అనధికార మిత్రపక్షమని విమర్శించారు. ఎన్నికల కోసమే టీడీపీ, వైసీపీ డ్రామాలు ఆడుతున్నాయని తులసిరెడ్డి ఆరోపించారు.ఎన్నికల తర్వాత రెండు పార్టీలు బీజేపీ వైపు చేరతాయన్నారు.
తెలుగు ద్రోహుల పార్టీగా టీడీపీ పేరు మార్చుకోవాలని తులసిరెడ్డి ఎద్దేవాచేశారు. వైసీపీ నకిలీ, కబ్జాకోరు పార్టీ అని తులసిరెడ్డి దుయ్యబట్టారు. మరోవైపు టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications