అమరావతి రాజదానిగా ఉంటే జగన్ సక్సెస్ కాలేరు :హైదరాబాద్ యూటీగా ఖాయం: మాజీ ఎంపీ సంచలనం..!!
ఏపీ రాజధాని గురించి మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యల రగడ ముగియక ముందే మరో వివాదం తెర మీదకు వచ్చింది. తుళ్లూరు శపించిన ప్రాంతమని..అక్కడ రాజధాని శ్రేయస్కరం కాదని మాజీ ఎంపీ చింతా మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర రాజధాని తుళ్ళూరు దళితుల రక్తంతో తడిచింది. అక్కడ రాజధాని ఉన్నంత వరకూ జగన్మోహన్రెడ్డి రాణించలేరు అంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా తిరుపతి రాజధానికి సరైన ప్రాంతమంటూ సూచించారు. ఇక..మహరాష్ట్ర ఎన్నికల తరువాత హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయబోతున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన ప్రకటన చేశారు.
తుళ్లూరు శంపించబడ్డ ప్రాంతం..
తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఏపీ రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం రేగింది. దీని పైన రాజకీయ పార్టీలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసాయి. రాజధాని ముంపు ప్రాంతమని..అక్కడ నిర్మాణాలు భారీ ఖర్చుతో కూడుకున్నవని మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాజీ ఎంపి చింతా మోహన్ తుళ్ళూరు శపించబడ్డ ప్రాంతమని.. అక్కడ రాజదాని శ్రేయస్కరం కాదని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర రాజధాని తుళ్ళూరు దళితుల రక్తంతో తడిచిందని... అక్కడ రాజధాని ఉన్నంత వరకూ జగన్మోహన్రెడ్డి రాణించలేరంటూ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అక్కడ రాజధాని అంత శ్రేయస్కరం కాదని... చంద్రబాబు ఓటమికి రాజధాని అమరావతే ప్రధానకారణం... తుళ్ళూరు రాజధానిగా ఎన్నుకోవడం వలనే చంద్రబాబు కాలు జారిపడ్డారంటూ విశ్లేషించారు. ఏపీ రాజధానిగా తిరుపతి సరైన ప్రాంతం అని గతంలో చెప్పిన చింతా మోహన్ మరో సారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇప్పుడు చింతా మోమన్ చేసిన వ్యాఖ్యల మీద రాజధాని ప్రాంత నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..
చింతా మోమన్ అమరావతితో పాటుగా హైదరాబాద్ గురించి మరో కీలక వ్యాఖ్యలు చేసారు. మహరాష్ట్ర ఎన్నికల తరువాత హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేయబోతున్నారని చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాశ్మీరు ప్రభావం దేశం మీద ఏ రూపంలో ఉందో చూస్తున్నామని.... రాజ్యసభలో మెజారిటీ రాగానే హైదరాబాద్పై దృష్టిపెట్టబోతున్నారు..అంటూ చింతా మోహన్ చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితమే బీజేపీ నేతలు ఈ ప్రతిపాదన పైన ఆలోచన చేస్తున్నారనే చర్చ సాగింది. అయితే..దీని పైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అటువంటి ఆలోచన కేంద్రానికి లేదని తేల్చి చెప్పారు. కానీ, ఇప్పుడు చింతా మోహన్ మాత్రం తనకు కేంద్రంలో ఉన్న అత్యంత నమ్మకమైన సమాచారం అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటంతో పాటుగా దేశానికి రెండో రాజధాని చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఉందనే ప్రచారం సాగింది. దీని ద్వారా దక్షిణాదిన మైలేజ్ వస్తుందని కేంద్రం అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. కిషన్ రెడ్డి వివరణ తరువాత ఈ చర్చకు తాత్కాలికంగా ముగింపు పడింది. ఇప్పుడు మాజీ ఎంపీ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలతో తిరిగి ఇది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications