టిడిపి టార్గెట్.. ఇదీ లెక్క, నన్నొద్దనే డ్రామా: టిపై బాబు
హైదరాబాద్: అధికార కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అనుమానం వ్యక్తం చేశారు. ఆయన పలువురు ప్రజాప్రతినిధులతో టిడిఎల్పీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే టిడిపిని టార్గెట్గా చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టిడిపి గెలవగానే తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం వచ్చిందని, తాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ను కలిసినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసినప్పుడు కేబినెట్ నోట్ వచ్చిందని బాబు చెప్పారు.
తన ఇమేజ్ను పెంచుకోవడానికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి సొంతమా లేక అధిష్టానం డ్రామానా తేలాల్సి ఉందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తనను మాట్లాడకుండా చేసేందుకే డ్రామాలు ఆడుతున్నారనే అనుమానం కలుగుతోందన్నారు.
వచ్చే మూడు రోజులు సభ్యులు అందరు అందుబాటులో ఉండాలని సూచించారు. కాగా, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సభ్యులు ఒక్కొక్కరి నుండి చంద్రబాబు అభిప్రాయాలు సేకరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు నివాసంలో పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది.