కాంగ్రెస్కు షాక్: జగన్ పార్టీలోకి మాజీ మంత్రి శైలజానాథ్?
అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల టికెట్లు ఆశించి ఆయన భంగపాటు చెందారు.
ఆ రెండు పార్టీల నుంచి కూడా టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపునే శింగనమల నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెసు కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తున్నారు. మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోలుకోలేదని భావిస్తున్న ఆయన తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ మారాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
దాంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. శింగనమల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జొన్నలగడ్డ పద్మావతి ఆ పార్టీ పట్ల ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. పద్మావతి సామాజిక వర్గం శింగనమలలో తక్కువే. శైలజానాథ్ సామాజిక వర్గం శింగనమలలో అధికంగా ఉన్నారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శైలజానాథ్ అనుచరులున్నారు. స్థానిక నాయకులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ కూడా శైలజానాథ్ను పార్టీలో చేర్చుకుని, టికెట్ ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.
సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే యామినీ బాలను ఎదుర్కునే ధీటైన నేత శైలజానాథేనని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొద్దిరోజుల్లోనే శైలజానాథ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోవడం ఖాయమని అంటున్నారు.