ఏం చేద్దాం?: కొత్త పార్టీపై సీమాంధ్ర కాంగ్ తర్జన భర్జన
ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నదానిపై తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్లోని పలువురు నేతలు మంగళవారం భేటీ అయ్యారు. మంత్రి తోట నర్సింహం నివాసంలో ఈ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పళ్లంరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.
మాజీ మంత్రి విశ్వరూప్ లాంటి కొంతమంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారని, తాము అక్కడ ఇమడలేమని మరొక నేత, టిడిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీలోకి కూడా వెళ్లలేమని ఇంకో నేత ఆవేదన వ్యక్తం చేశారట.
కాంగ్రెస్లోనే పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్న వాదనా ఈ అంతర్గత సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎపిఎన్జీవోలను కలుపుకొని సమైక్యాంధ్ర పేరుతోనే కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందనే అంశంపై నేతలు చర్చించారట.
కాగా, తాను ముమ్మాటికి సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పళ్ళంరాజు స్పష్టం చేశారు. అన్నవరం సత్యదేవుడిని ఆయన సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర విషయంలో తనకు పార్టీ నిర్ణయంకన్నా ప్రజాభిష్టమే శిరోధార్యమన్నారు. అందుకే తన రాజీనామాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు అందజేశానని చెప్పారు. అయితే దాన్ని ఆమోదించాల్సి ఉందన్నారు.
తెలంగాణాపై ఆంటోని కమిటీ నివేదిక రాకుండానే క్యాబినెట్ నోట్ పెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జివోఎం కమిటీ రాష్ట్రంలో తిరిగి ప్రజాభిప్రాయాలు సేకరిస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. విభజన వల్ల అధిష్టానానికి అనేక సమస్యలు ఎదురవుతాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశానన్నారు.