సంచలన వ్యాఖ్య: 'బాలకృష్ణ అంటే గౌరవం కానీ, చిరంజీవిని అంటారా'
అనంతపురం/కడప: తమ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు చిరంజీవి పైన హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. లేపాక్షి ఉత్సవాలు బాలకృష్ణ సొంత నిధులతో చేస్తున్నారా? ప్రభుత్వ ఖర్చులతో చేస్తున్నారో తెలియదన్నారు. ఆయన చిరంజీవి గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదన్నారు.
బాలకృష్ణకు తాము వ్యతిరేకం కాదని, అయితే చిరంజీవిని విమర్శించే హక్కు ఆయనకు లేదని చెప్పారు. బాలకృష్ణ వ్యాఖ్యల పైన పలువురు అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27, 28వ తేదీలలో తన నియోజకవర్గంలో రూ.4 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నీ తానై ముందుండి చూసుకుంటున్నారు.
ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఉత్సవాలకు అటు కేంద్ర మంత్రులతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను కలిసి స్వయంగా ఆహ్వానపత్రాలను అందజేసి ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఏపీ సీఎం చంద్రాబబుని ఆహ్వానించిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
ఈ మీడియా సమావేశంలో లేపాక్షి ఉత్సవాలకి చిరంజీవిని ఆహ్వానించారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినీ పరిశ్రమ నుంచి మోహన్ బాబు, జయసుధను తప్ప మరెవరినీ పిలవలేదని అన్నారు.
నేను ఎవరిని నెత్తిన ఎక్కించుకోనని, నా నెత్తిమీద ఎక్కేవారిని పిలవాల్సిన అవసరం లేదన్నారు. ఇండస్ట్రీ నుంచి తాను ఎవరినీ పిలవలేదని చెప్పిన ఆయన నా పక్కన గ్లామర్ ఉన్నవారే ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్లతోనే కలిసి ప్రయాణిస్తానని అన్నారు. లేపాక్షి ఉత్సవాలు నా కష్టార్జితమని, ఎవరిని పిలవాలో ఎవరిని పిలకూడదో తనకు తెలుసని అన్నారు.
ఉత్సవాలకు రకరకాల మనుషులు వస్తుంటారని, నేను నా పద్ధతిలోనే వెళతానని అన్నారు. డిక్టేటర్ పద్ధతిలోనే వెళతానని చమత్కరించారు. మీడియా సమావేశంలో చిరంజీవి ప్రస్తావన రాగానే బాలకృష్ణ కళ్లు కాస్త పెద్దవి చేసి తనదైన శైలిలో మాట్లాడారు.