70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్: లగడపాటి
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఆపకపోతే 70 శాసనసభ్యులు, 12 మంది పార్లమెంటు సభ్యులు పార్టీని వీడుతారని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెసుకు ఒక్క సీటు కూడా రాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశం చివరి దశకు చేరిందని, అసెంబ్లీ తీర్మానం చేయకుండా విభజన సాధ్యం కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వకున్నా ఫరవా లేదని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇష్టమైనవారికి టికెట్లు ఇచ్చినా తాము వారిని గెలిపిస్తామని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే రాష్ట్ర సమైక్య సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర సమైక్యత కంటే రాజకీయ జీవితం ముఖ్యం కాదని అన్నారు. రాష్ట్ర సమైక్యం కోసం తన ఎంపి స్థానాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధమని లగడపాటి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలోని సీమాంధ్ర నేతలే రాష్ట్ర సమైక్యం కోసం పోరాడుతున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రులతోపాటు కేంద్రమంత్రులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి పోరాటం చేస్తున్నది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలేనని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నామని, అలా చేస్తే రాష్ట్రం బాగుంటుందని అన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లగడపాటి తెలిపారు. తెలంగాణపై వెనక్కి వెళ్లేది లేదని రాహుల్ గాంధీ చెప్పారు కదా అని మీడియా ప్రశ్నించగా.. ఆయన అలా ఏం చెప్పలేదని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లుపై ఓటింగ్ జరపాలని ఆయన అన్నారు. మెజార్టీల అభిప్రాయమే అసెంబ్లీ అవుతుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. బిల్లుపై వ్యక్తిగత, సభ అభిప్రాయం కావాలని అందులో ఉందని లగడపాటి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఆరుగురితో మొదలై 60మందికి చేరుకుందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల ఆందోళనతోనే పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయని అన్నారు. సకాలంలోనే, సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని లగడపాటి తెలిపారు.
రాష్ట్ర సమైక్యం కోసం తమ వద్ద అనేక అస్త్రాలున్నాయని లగడపాటి చెప్పారు. బ్రహ్మాస్ర్తాన్ని చివరలో ఉపయోగిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం తమ మీద చర్య తీసుకున్నా పర్వాలేదు కానీ, విభజన నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు బాధ, ఆవేదనతో చేసినవేనని లగడపాటి అన్నారు. విభజన నిర్ణయాన్ని మార్చుకోని నాయకత్వాన్ని మారిస్తే మంచిది కదా అని జెసి అన్నారని, ఆయన కాంగ్రెస్ పై ద్వేషం గానీ, కోపం గానీ లేదని తెలిపారు.