టిడిపి వెళ్లినా, మోడీ ప్రధానిగానే ఉంటారు, గడ్డి బొమ్మ తగులబెడతారా: వెంకయ్య
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోతుందని కొందరు అవాస్తవాలను చెబుతున్నారనని, హైదరాబాద్ రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదనే విషయం తెలుసుకోవాలని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు శనివారం అన్నారు.
పలువురు ముఖ్యమంత్రుల హయాంలో నలభై ఏళ్ల పాటు, రాష్ట్రంలోని నిధులన్నీ తీసుకెళ్లి అక్కడ పెడితేనే అభివృద్ధి చెందిందన్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తే రూ.4.25 లక్షల కోట్లు మేర పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని చెప్పారు.
ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడులు పెడతామని వారెవరూ అనలేదన్నారు. విద్యుత్తు, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయని, అనుమతులు ఎలా ఇస్తున్నారని, కేంద్రం, రాష్ట్రం పరస్పరం సహకరించుకుంటున్నాయా, లేదా అనే అంశాలనే వారు చూస్తారన్నారు.
2015-16లో పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. టిడిపి కేంద్రం నుంచి వైదొలగాలి అంటున్నారని, వైదొలిగినా 2019 వరకూ ప్రధానమంత్రిగా నరేద్ర మోడీ పదవికి ఢోకా లేదన్నారు. మళ్లీ ఆయనే గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయన్నారు.
కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లలేదని, కేంద్రం నుంచి వైదొలిగితే రెండు, మూడు రోజులు పతాక శీర్షికల్లో ప్రచారం తప్ప ప్రయోజనముండదని, వాళ్లకు కావాల్సింది ప్రత్యేక హోదా కాదని, నరేంద్ర మోడీ, చంద్రబాబుల పదవుల హోదా అనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సమర్థుడు, సకాలంలో పూర్తి చేయగలరన్న నమ్మకంతోనే పోలవరం బాధ్యతలు అప్పగించామని చెప్పారు. తాను ఏపీ కోసం ఇంత కష్టిస్తుంటే తమ గడ్డిబొమ్మలు దగ్ధం చేయడం విడ్డూరమన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోతుందని కొందరు అవాస్తవాలను చెబుతున్నారనని, హైదరాబాద్ రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదనే విషయం తెలుసుకోవాలని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు శనివారం అన్నారు.