నాయుళ్లంటూ రఘువీరా ఫైర్, గ్యాస్ బాయ్ సంతకం
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్దమా అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు వెంకయ్యకు బహిరంగ లేఖ రాశారు.
శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య, కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ తదితరులతో కలిసి ఈ లేఖను విడుదల చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బీజేపీ పాత్ర - వాస్తవాలు పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 సందర్భంగా మాట్లాడిన మాటలన్నీ పూర్తిగా మరిచిపోయి మతిమరుపు వెంకయ్యగా మారిపోయారని ఎద్దేవా చేశారు. విభజన బిల్లుపై వెంకయ్య రాజ్యసభలోనూ, బయటా చేసిన ప్రసంగాన్ని, ఏపీ బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోను గుర్తు చేయడం ద్వారా మతిమరుపును పోగొట్టాలన్న సదుద్దేశంతోనే తాము బహిరంగ లేఖ రాస్తున్నామే తప్ప వేరే ఉద్దేశాలేవీ లేవన్నారు.
సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల అక్షర రూపం అనే ఆకర్షణీయమైన శీర్షికతో ఏపీ బీజేపీ 2014లో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలోని మూడోపేజీలో... ‘కేంద్ర సహాయంలో భాగంగా ఐదేళ్లపాటు విభజనానంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను బీజేపీ ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు పొడిగిస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్తించే విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ. ఒడిస్సాల్లోని కోరాపుట్-బోలంగీర్-కలహండి, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ తరహాలో ఈ ప్రత్యేక ప్యాకే జీ ఉంటుంది. విభజనానంతరం ఈ సంవత్సరం కలిగే ఆర్థికలోటును కేంద్ర మే పూర్తిగా భరిస్తుంది.' అని పేర్కొన్నారా లేదా అని వెంకయ్యను ప్రశ్నించారు.

వెంకయ్య, చంద్రబాబులు పరస్పర డబ్బా కొట్టుకోవడం తప్ప రాష్ట్రానికి ఒక్కమేలైనా చేశారా అన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని బీజేపీ ఎప్పుడు కూల్చేస్తుందోనన్న భయం నిరంతరం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే విభజన హామీలను బీజేపీ విస్మరించినా చేతకాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారు తప్ప కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ఆరోపించారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ కోటి సంతకాలు సేకరిస్తోంది.












Click it and Unblock the Notifications