కవిత వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం: టి, కాశ్మీర్పై అభిషేక్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్, తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కవిత చేసిన పలు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ హౌజ్ వద్ద అభిషేక్ సింఘ్వి మీడియాతో మాట్లాడుతూ.. ఎంపి కవిత పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సంబంధం లేని అంశాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజల ఆశలతో పాటూ జమ్మూకాశ్మీర్ ప్రజల సమస్యలూ తనకు ముఖ్యమేనని ఆమె అన్నారని.. అయితే ఇంతవరకూ బాగానే ఉందని ఆయన చెప్పారు. భారతదేశంలోని ఓ ప్రాంతానికి చెందిన ఆమె, ఇతర ప్రాంతాల ప్రజల గురించి అదుర్దా పడటం అనేది జాతీయ సమగ్రతా భావాలకు ప్రతీక అని చెప్పారు. ఈ తరహా భావాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని సింఘ్వి తెలిపారు.

అయితే, అటు తెలంగాణకు, ఇటు జమ్మూకాశ్మీర్కు సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలో కొన్ని వాస్తవ విరుద్ధమైనవి కూడా ఉన్నాయని చెప్పారు. దీనిపై తాము విస్పష్ట వివరణ ఇవ్వకుంటే అది భారత సమగ్రత, సమైక్యతలపై లేనిపోని సందేహాలు తలెత్తడం ఖాయమని నమ్ముతున్నామని.. అందుకే తమ అభ్యంతరాలను స్పష్టం చేస్తున్నట్లు సింఘ్వి తెలిపారు.
‘కొన్ని భాగాలు మనవి కావు. అందుకు మనం అంగీకరించాలి. అంతర్జాతీయ సరిహద్దులను తిరిగి లిఖించాలి' అని కవిత చేసిన వ్యాఖ్యలపై తాను స్పష్టత ఇవ్వదలచుకున్నట్లు సింఘ్వి తెలిపారు. కాశ్మీర్ సంస్థానం మొత్తం భారతదేశంలో అంతర్భాగమని, పైగా విడదీయడానికి వీల్లేని భాగమని చెప్పారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆధీనంలో పెట్టుకున్న భూభాగం అంతా కూడా చట్టవిరుద్ధంగా ఆక్రమించినదే అని ఆయన స్పష్టం చేశారు. ‘కొన్ని భాగాలు మనవి కావు' అన్న కవిత వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమని సింఘ్వి తెలిపారు.












Click it and Unblock the Notifications