గడీల రాజ్యం: కెసిఆర్పై కాంగ్రెసు ఎదురుదాడి
హైదరాబాద్: పొత్తు కూడా పెట్టుకోబోమని ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై కాంగ్రెసు తెలంగాణ నేతలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. దీంతో ఇరు పార్టీల నాయకులలు కయ్యానికి కాలు దువుతున్నారు. తెలంగాణలో తమ దమ్మేమిటో చూపిస్తామని వారు కెసిఆర్కు సవాల్ విసిరారు. తెరాస అధికారంలోకి వస్తే గడీల తెలంగాణనే మళ్లీ నిర్మిస్తుందని కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ ధ్వజమెత్తారు. తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్థి తెరాస కాదని, తెలుగుదేశం పార్టీ అని చెప్పారు.
కమిటీ వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ, పార్టీ నేతలు బస్వరాజు సారయ్య, పి.సుధాకర్రెడ్డిలతో కలిసి ఆదివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విలీనం, పొత్తుల గురించి కాంగ్రెస్ ఏనాడూ అడగలేదని, దళితులను సీఎం చేస్తానని, మైనారిటీలను ఉప ముఖ్యమంత్రి చేస్తామని కెసిఆర్ అన్నారని, కానీ, ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
దగా, మోసం, వంచనకు పర్యాయ పదం తెరాస ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అంటోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సామాజిక తెలంగాణ నిర్మితమవుతుందని, నవ తెలంగాణ ఏర్పడుతుందని చెప్పారు. 2004లో తెరాస 52 సీట్లకు పోటీ చేసి 26 గెలిచిందని, 2009లో 52కు పోటీ చేసి కేవలం 10 సీట్లలోనే గెలిచిందని వారు గుర్తు చేశారు. ఇప్పుడేమో గిమ్మిక్కులు, మైండ్ గేమ్తో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్సించారు
కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి అసాధ్యాన్ని సాధ్యం చేసిందని, సోనియాగాంధీ సగం కడుపు కోసుకుని తెలంగాణ ఇచ్చిందని, పార్టీ ఒక ప్రాంతంలో నష్టపోయినా.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఆమె నిలబెట్టుకున్నారని చెప్పారు. నమ్మకం, విశ్వాసం, అమాయకత్వానికి పర్యాయ పదాలైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్పై విశ్వాసం ఉంచి ఓటేస్తారని దామోదర చెప్పారు.
రాష్ట్ర విభజనపై తనను పిలిచి మాట్లాడలేదని కెసిఆర్ చెప్పారని, జీవితంలో తొలిసారి ఆయన వాస్తవం చెప్పారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు, ప్రజలతో చర్చించి కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ఇచ్చిందన్నారు. పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలను వదులుకుని, లోక్సభలో 16 మంది ఎంపీలను సస్పెండ్ చేసి విభజన బిల్లును ఆమోదింపజేసిందని తెలిపారు.
ఎవరితో పొత్తులున్నా, లేకపోయినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విజయ యాత్ర ముగింపు సందర్భంగా గాంధీ భవన్ లో యువజన కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తమవల్లే తెలంగాణ సాకారమైనట్లు కొందరు ప్రచారం చేసుకుంటున్నారని అంటూ దాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చా రు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పొన్నాల లేదా దామోదర లేదా బలరాం నాయక్ ప్రభుత్వాధిపతులయ్యే అవకాశం ఉందని, కాంగ్రెస్ రాకపోతే కుటుంబ పాలన వస్తుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రె స్కు 75 సీట్లు వస్తాయని తన సర్వేలో తేలిందన్నారు.
కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరతారని అంటున్నారని, అలాంటి వారి సంగతి, తెలంగాణలో దొరల సంగతి తేలుస్తామని వి.హన్మంతరావు తీవ్రంగా హెచ్చరించారు. గాంధీభవన్లో ఆదివారం పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్రశాఖ భేటీలో ఆయన మాట్లాడారు. కలెక్షన్ల కోసం కాకపోతే కేవలం తన కుటుంబ సభ్యులతోనే కెసిఆర్ సోనియాను ఎందుకు కలుస్తారని ప్రశ్నించారు. తెరాసను విలీనం చేస్తామని చెప్పి, గద్వాలలో, మహబూబ్నగర్లో అభ్యర్థులను ప్రకటిస్తారా? అని నిలదీశారు.
కెసిఆర్ వల్లే తెలంగాణలో 1,200మంది బలిదానం చేసుకోవాల్సి వచ్చిందని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్, తెరాస విధానాలవల్లే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని విమర్శించారు జాగో భాగో అన్న హెచ్చరికలతోనే తెలంగాణ ఆలస్యమైందని, కెసిఆర్ కుటుంబంతో సోనియాను కలవడమేమిటని, కుడిఎడమలుగా ఉన్న ఈటెల, నాయినిలను కాదని కలవడమంటే ప్యాకేజీల కోసమేనా అని ఎద్దేవా చేశారు.