పవన్ సపోర్ట్తో జగ్గారెడ్డి!: మెదక్పై కాంగ్రెస్, తెరాస దృష్టి
ఉప ఎన్నికలో పోటీకి నిలిపే అభ్యర్థిపై తెరాస ఇప్పటికే కసరత్తు మొదలెట్టింది. మరోవైపు సంగారెడ్డిలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన కె జగ్గారెడ్డి.. బిజెపిలో చేరి మెదక్ లోకసభనుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రవణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికలోనూ పోటీ చేయడానికి శ్రవణ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనను పోటీ చేయించాలా వద్దా అని పార్టీలో చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, డిసిసి అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, పిసిసి కార్యదర్శి బండారు శ్రీకాంత్, దివంగత బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు, నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ, వెలమ సామాజిక వర్గం ఓట్లను పార్టీ పరిశీలనలోకి తీసుకుంటోంది.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 3,97,029 ఓట్ల భారీ మెజారిటీ తో సీటు కోల్పోవడాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్న పార్టీ ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. లేదా ఇతర జిల్లాల నుంచి మరో గట్టి నేతను తీసుకొచ్చి పోటీ చేయించాలా అన్న ఆలోచన కూడా చేస్తోంది.