నేను డిప్యూటీ కలెక్టర్ ని-ఉద్యోగాలిప్పిస్తా- విజయవాడలో 80 లక్షల మేర టోపీ !
విజయవాడలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం చోటు చేసుకుంది. తనను తాను డిప్యూటీ కలెక్టర్ గా చెప్పుకుంటూ ఓ కాంట్రాక్టు ఉద్యోగి నిరుద్యోగుల్ని నిండా ముంచాడు. వారి నుంచి లక్షలు దోచుకుని ఉడాయించాడు. దీంతో ఉద్యోగాల కోసంఎదురుచూస్తున్న వారంతా లబోదిబోమంటున్నారు.
విజయవాడలో రాజేంద్ర అనే ఓ మాజీ మాజీ ప్రభుత్వ ఉద్యోగి సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మబలికాడు. వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి కాజేశాడు. ఇలా నిరుద్యోగుల నుంచి సుమారు 80 లక్షల వరకు రాజేంద్ర కాజేసినట్లు అంచనా వేస్తున్నారు. చివరికి ఓ మహిళా బాధితురాలు పక్కాప్రణాళికతో గన్నవరం పిలిపించి మోసగాడిని పట్టుకుంది.

ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తానని ఓ మహిళ నుంచి రాజేంద్ర 9 లక్షలు రూపాయలు తీసుకున్నాడు. అయినా పని కాకపోవడంతో మరో లక్షన్నర ఇస్తానని రాజేంద్రను గన్నవరానికి సదరు మహిళ రప్పించింది. దీంతో ఆమె మాటలు నమ్మి అక్కడికి వచ్చిన రాజేంద్రను సదరు మహిళ గ్రామస్థుల సహకారంతో పట్టుకుంది. విజయవాడ చిట్టినగర్ కు చెందిన పిల్లా వెంకట రాజేంద్రగా అతన్ని గుర్తించారు. గతంలో రాజేంద్ర సీఆర్డీయే కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసినట్లు తెలిసింది. అవినీతి, అక్రమాలకు పాల్పడి ఈ ఉద్యోగం పోగొట్టుకున్నట్లు కూడా తేలింది.
ఇంత డబ్బు కాజేసిన రాజేంద్ర.. దీనిపై అడిగితే బాధితులకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే తనకు పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అతను చెప్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై పోలీసు స్పందనలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు.
రాజేంద్రపై ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. రాజేంద్ర ఫోన్ లో ఎక్కువ శాతం పోలీస్ అధికారులు ఫోన్ నంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాసినో వంటి విలాశాలకు అలవాటుపడి ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కాజేసినట్లు ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. రాజేంద్ర వద్ద వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన దొంగ ఐడి కార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications