300 మందితో తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యే హల్చల్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 67,223 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,549 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. బయటి వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ అధికారులు తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ కోటా కింద జారీ చేసే టికెట్ల సంఖ్యనూ కుదించారు. ఈ నెల 22వ తేదీ నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1,000కి మాత్రమే పరిమితం చేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో ఇవ్వనున్నారు.
ఒకవంక టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించడానికి పెద్ద ఎత్తున ఇలాంటి చర్యలు తీసుకుంటోండగా.. మరోవంక అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ అనుచరులతో తిరుమలలో హల్చల్ చేస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
చంద్రగిరికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఏకంగా 300 మంది అనుచరులతో తిరుమలలో శ్రీవారి దర్శించుకోవడం వివాదాస్పదమౌతోంది. అది కూడా బ్రేక్ దర్శన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు పులివర్తి నాని చర్యల పట్ల మండిపడుతున్నారు.
తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన తోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తీసుకుని ఆయన 300 మంది అనుచరులతో బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారని అంటున్నారు. ఒకేసారి అంతమంది అనుచరులతో శ్రీవారి దర్శనానికి రావడం వల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గరయ్యారని తెలుస్తోంది. గంటల కొద్దీ పడిగాపులు పడాల్సి వచ్చిందని అంటున్నారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఆర్ కే రోజా ఇలాంటి చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు టీడీపీ నాయకులు. రోజాపై మీమ్స్ను తయారు చేసి వదిలారు. ఇప్పుడు అదే టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు రోజా చేసిన తప్పును పునరావృతం చేయడం పట్ల అటు భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications