ఎపి, తెలంగాణ మధ్య తాజా వివాదం పులిచింతల
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో నల్గొండ జిల్లాలో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో దీనిపై చర్చించేందుకు గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వను 11 టీఎంసీల నుంచి 7.5 టీఎంసీలకు తగ్గించేందుకు ఎపి ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ సీఎంవో ప్రకటనలో అన్నది.
ముంపు గ్రామాల ప్రజలకు రూ.30 కోట్లు నష్ట పరిహారం ఇప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని కూడా ప్రకటనలో తెలిపింది. నల్గొండ జిల్లాలోని నాలుగు గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది కలగన్విబోమని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలోని నాలుగు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం కూడా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిందని, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడారని ప్రకటనలో చెప్పారు.
అయితే, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యాన్ని 11 టీఎంసీల నుంచి 7.5 టీఎంసీలకు తగ్గించటానికి తాము అంగీకరించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాము పులిచింతల ప్రాజెక్టులో తొలుత అనుకున్న విధంగానే 11 టీఎంసీలను నిల్వ చేసుకుంటామని తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంతంలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు సహాయ, పునరావాస ప్యాకేజీకి అవసరమైన నిధులు రూ.30 కోట్లను వెంటనే చెల్లించేందుకు అంగీకరించామని తెలిపింది.
ఇప్పటికే పది కోట్ల రూపాయలు చెల్లించామని, మిగిలిన రూ.20 కోట్లును గురువారం విడుదల చేశామని వివరించింది. ఈ మొత్తాన్ని వారం రోజుల్లో ముంపు నిర్వాసితులకు అందజేసేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమకు హామీ ఇచ్చారని, అప్పటి వరకు 7.5 టీఎంసీలు నిల్వ ఉంచి, ఆ తర్వాత క్రమేపీ పెంచుతూ 11 టీఎంసీలకు చేరుస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.